వ్యాక్సిన్ అనేది ఎంత కాలం రక్షిస్తుంది? ఎంత మేరకు రక్షణ కల్పిస్తుంది? అనే అంశాలు ప్రధానమని ఆల్ ఇండియా ఇన్ స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఏయిమ్స్) డైరెక్టర్, ప్రముఖ ఛాతీ వ్యాధుల నిపుణుడు డాక్టర్ రణదీప్ గులేరియా అన్నారు. ఏ వ్యాక్సిన్ అయినా సరే ఎంత మందిపై ప్రయోగించారు? ఎంత మేరకు ఫలితం వచ్చింది అనేది ప్రధానమని ఆయన అన్నారు.
రష్యా వ్యాక్సిన్ విడుదల చేస్తున్నదనే ప్రకటన నేపథ్యంలో రణదీప్ గులేరియా వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. వ్యాక్సిన్ రూపొందించడంలో రోగి భద్రత అనేది ప్రధాన అంశమని ఆయన అన్నారు. రష్యా తీసుకురాబోతున్న వ్యాక్సిన్ లో కూడా ఈ అంశాలను చూడాల్సి ఉందని ఆయన అన్నారు.
భారత్ లో మూడు వ్యాక్సిన్లు క్లినికల్ ట్రయల్స్ దశలో ఉన్నాయని ఆయన తెలిపారు. పూనే సీరం ఇన్ స్టిట్యూట్ తో కలిసి ఆక్సఫర్డ్ యూనివర్సిటీ రూపొందిస్తున్న వ్యాక్సిన్, భారత్ బయోటెక్ రూపొందిస్తున్న వ్యాక్సిన్, జైడస్ క్యాడిలా వారు రూపొందిస్తున్న డిఎన్ఏ వ్యాక్సిన్ లు క్లినికల్ ట్రయల్స్ దశలో ఉన్నాయని ఆయన తెలిపారు.
ప్రపంచానికి వ్యాక్సిన్ అందచేసే శక్తి భారత్ కు ఉందని ఆయన అన్నారు. ప్రస్తుతం వివిధ వ్యాక్సిన్లను ప్రపంచంలోని చాలా దేశాలకు భారత్ మాత్రమే అందిస్తున్నదని గులేరియా తెలిపారు.
ప్రపంచ దేశాలకు 60 శాతం మేరకు వ్యాక్సిన్లను సరఫరా చేస్తున్న దేశం మనదేనని ఆయన వెల్లడించారు. దేశంలో కరోనా కేసులు ఇంకా పూర్తి స్థాయిలో పెరగలేదని, రాబోయే రోజుల్లో మరింత ఉధృతంగా ఈ వ్యాధి ఉండవచ్చునని ఆయన తెలిపారు.