సైబర్ దాడికి గురైన దేశ రాజధాని ఢిల్లీలోని ప్రతిష్టాత్మకమైన ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ సర్వర్ ను ఎట్టకేలకు పునరుద్ధరించారు. ఢిల్లీ ఎయిమ్స్ మేనేజ్మెంట్ మంగళవారం సాయంత్రం సైబర్-సెక్యూరిటీ సంఘటనపై ఒక ప్రకటన విడుదల చేసింది. సర్వర్లో ఎయిమ్స్ డేటా పునరుద్ధరించబడిందని పేర్కొంది. సేవలను ప్రారంభించే ముందు నెట్వర్క్ శానిటైజ్ చేయబడుతోంది.
అంతే కాకుండా సైబర్ సెక్యూరిటీకి కూడా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. డేటా పరిమాణం పెద్ద సంఖ్యలో ఉండటం వల్ల సర్వర్లు, కంప్యూటర్ల పూర్తిగా పునరుద్ధరించేందుకు మరి కొంత సమయం పడుతుందని AIIMS ఆసుపత్రి తెలిపింది. ఔట్ పేషెంట్, ఇన్ పేషెంట్, ల్యాబ్తో సహా అన్ని ఆసుపత్రి సేవలు మాన్యువల్ విధానంలో కొనసాగుతాయని ఎయిమ్స్ యాజమాన్యం తెలిపింది.
అనుమానాస్పద ransomware దాడికి గురైన సర్వర్లను తీసివేసినప్పుడు కొంత డేటా పోతుందని దాన్ని పునరుద్ధరించేందుకు అదనపు సిబ్బందిని నియమించినట్లు AIIMS అధికారులు తెలిపారు. నవంబర్ 23న సర్వర్ డౌన్ కావడంతో మూడు నుంచి నాలుగు కోట్ల మంది రోగుల డేటా లీకేజీ అయ్యే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇందులో రాష్ట్రపతి, ప్రధానమంత్రి మరియు మాజీ ప్రధాని అనేక ఇతర మంత్రుల డేటా ఉంది. దర్యాప్తు సంస్థల సూచనల మేరకు ఆసుపత్రిలోని కంప్యూటర్లలో ఇంటర్నెట్ సేవలను నిలిపివేసినట్లు అధికారిక వర్గాలు తెలిపాయి. AIIMS సర్వర్లు మాజీ ప్రధానులు, మంత్రులు, బ్యూరోక్రాట్లు మరియు న్యాయమూర్తులతో సహా చాలా ముఖ్యమైన వ్యక్తుల (VIPలు) డేటాను నిల్వ చేస్తాయి.