గుంటూరు జిల్లా మంగళగిరి లో నిర్మాణం తలపెట్టిన అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ (ఎయిమ్స్) వైద్య శాల నిర్మాణం మరో ఏడాదిలో 950 పడకల వసతితో పూర్తవుతుందని, ఆరేళ్లలో ఢిల్లీ తరహా ఎయిమ్స్ అందుబాటులోకి వస్తుందని, ఇది రాష్ట్రానికి ప్రతిష్టాత్మకం అని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు ఆశా భావం వ్యక్తం చేశారు.
పెండింగ్ లో ఉన్న రోడ్లు,త్రాగు నీరు,విద్యుత్ సబ్ స్టేషన్ నిర్మాణ పనులు పూర్తయ్యేందుకు రాష్ట్ర ప్రభుత్వ ప్రిన్సిపల్ సెక్రెటరితో మాట్లాడతానని చెప్పారు. మంగళగిరి పట్టణ శివార్లలో నిర్మాణం జరుగుతున్న ఎయిమ్స్ వైద్య శాలను ఆయన శనివారం మధ్యాహ్నం సందర్శించారు.
వైద్య శాల సూపరిడెంట్ రాకేష్ కక్కర్ ను అడిగి పనుల పురోగతి వివరాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా సోము వీర్రాజు మీడియా తో మాట్లాడుతూ,రూ.1,800 కోట్లతో ఎయిమ్స్ వైద్య శాల నిర్మాణం అద్భుతంగా జరుగుతోందని ఇది కేంద్రం లోని బీజేపీ ప్రభుత్వ ఘనత అని చెప్పారు.
ప్రస్తుతం ఎయిమ్స్ లో వైద్య విద్యార్థులకు 3 వ సంవత్సరం ప్రవేశాలు జరుగుతున్నాయని గుర్తు చేశారు. ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు ఐదేళ్లు ముఖ్యమంత్రిగా ఉండి రాజధాని భవనాల నిర్మాణం పేరుతో రూ.750 కోట్లు ఖర్చు చేసి ఎయిమ్స్ తరహా భవనం ఒక్కటి అయినా నిర్మాణం జరిపించారా అని ప్రశ్నించారు.
పైపెచ్చు ఎయిమ్స్ తమ ఘనతగా టీడీపీ నేతలు చెప్పుకోవడం దారుణమని పేర్కొన్నారు.విభజిత బిల్లులో ఉన్న 90 శాతం హామీలను కేంద్రం నెరవేర్చిందని 18 ఇనిస్టిట్యూట్ లు ఏపీలో కేంద్రం నెలకొల్పే ప్రతిపాదనలో భాగంగా 15 ఇనిస్టిట్యూట్ ల ఏర్పాటు పూర్తి చేసిందని చెప్పారు.
ఇవన్నీ ప్రజలకు వివరించేందుకు రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించనున్నట్లు చెప్పారు. రాష్ట్రంలో రాజధాని వివాదం నడుస్తోందని గత ప్రభుత్వం జపాన్,సింగపూర్ తరహా రాజధాని అని ప్రచారం చేసుకొని రైతులకు రాళ్లు కూడా వేయలేదని, ప్రస్తుత ప్రభుత్వం 3 రాజధానులు అంటోందని సోము వీర్రాజు విమర్శించారు.
రైతులకు 64 వేల ఫ్లాట్లు ఇవ్వాలని,9 వేల ఎకరాల భూమిని అభివృద్ధి చేసి ఇవ్వాలని గత ప్రభుత్వం నెరవేర్చలేని ఈ హామీని ప్రస్తుత ప్రభుత్వం నెర వేర్చాలని డిమాండ్ చేశారు.
24 వేల ఎకరాల్లో డిజైన్ ఇనిస్టిట్యూట్
ఎయిమ్స్ ప్రాంగణంలో 24 ఎకరాల్లో డిజైన్ ఇనిస్టిట్యూట్ నిర్మాణానికి 4 ఎకరాల స్థలం మంజూరుకు రాష్ట్ర ప్రభుత్వ అనుమతి లభించాల్సి ఉందని అన్నారు. కోవిడ్ కు ముందు 8 వేల మంది రోగులకు చికిత్స అంధించేందుకు అవకాశం ఉన్న వసతి ఎయిమ్స్ లో ఉందని అన్నారు.
ప్రైవేట్ ఆసుపత్రుల్లో రక్త పరీక్షలకు రూ.3 వేలు ఖర్చు అయితే ఎయిమ్స్ లో కేవలం 700 మాత్రమే ఖర్చు అవుతోందని,హైదరాబాద్ నిమ్స్ తరహా వైద్య సేవలు లభిస్తున్నాయన్నారు. పేదలు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నట్లు చెప్పారు. మరో ఏడాదిలో అన్ని సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు అందుబాటులోకి వస్తాయని ప్రస్తుతం 3 వేల మంది ఉపాధి పొందుతున్నారని చెప్పారు. ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ నాయకులు జగ్గారపు శ్రీనివాసరావు, జగ్గారపు రాము,పాతూరి నాగభూషణం,కంకణాల శివ తదితరులు పాల్గొన్నారు.