హమాలీలకు పెంచిన జీతాలు, పీఎఫ్ చెల్లించాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేస్తూ కడప జిల్లా రాజంపేట సివిల్ సప్లై గోడౌవున్ వద్ద ఏఐటీయూసీ ఆధ్వర్యంలో గురువారం నిరసన ప్రదర్శన నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి జిల్లా ఏఐటీయూసీ జిల్లా ఉపాధ్యక్షుడు యం.యస్.రాయుడు అధ్యక్షత వహించారు. రాజంపేట సీపీఐ ఏరియా కార్యదర్శి మహేష్ సంఘీభావం ప్రకటించారు.
ఈ సందర్భంగా జిల్లా ఏఐటీయూసీ జిల్లా ఉపాధ్య క్షుడు యం.యస్. రాయుడు మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఏఐటీయూసీ పిలుపు మేరకు రెండో రోజు ఈ నిరసన వ్యక్తం చేసినట్టు తెలిపారు.
2019 ఒప్పందం ప్రకారం సివిల్ సప్లై గోడౌవున్ హమాలీలకు పెంచిన జీతం ఇంతవరకు ఇవ్వలేదని, పీఎఫ్ చెల్లించ లేదని ఉద్యోగ భద్రత కూడా లేదని ఇచ్చిన హామీలను అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.