హనుమంతుడి జన్మస్థలం విషయంపై ఉగాది సందర్భంగా తిరుమల తిరుపతి దేవస్థానం ప్రకటన చేసింది. శ్రీవారు కొలువై ఉన్న తిరుమలే ఆంజనేయుడి జన్మస్థలమని ఆధారాలతో పాటు టీటీడీ ఈవో కేఎస్ జవహర్రెడ్డి ప్రకటన చేశారు. ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ.. హనుమ జన్మస్థలంపై పండితులు ఆధారాలు సేకరించారని, తమ వద్ద ఉన్న ఆ బలమైన ఆధారాలను బయటపెడతామని చెప్పారు.
ఆధారాలతో నివేదిక తయారు చేశామని, దాన్ని త్వరలోనే ప్రజల ముందుంచి అభిప్రాయాలు సేకరిస్తామని తెలిపారు. ఆంజనేయుడి జన్మస్థలం తమ రాష్ట్రంలోనే ఉందని ఇప్పటివరకు ఏ రాష్ట్రమూ ప్రకటించలేదని ఆయన చెప్పారు. ఒకవేళ ఇతర రాష్ట్రాల వద్ద అటువంటి ఆధారాలు ఉంటే బయటపెట్టవచ్చని చెప్పారు.
ఈ విషయంపై క్షేత్రస్థాయిలో చర్చ జరగాలని వ్యాఖ్యానించారు. తిరుమల సప్తగిరుల్లో ఒకటైన అంజనాద్రిలోనే ఆంజనేయుడు జన్మించాడన్న విషయంపై గత ఏడాది డిసెంబరులో పండితులు, నిపుణులతో టీటీడీ కమిటీని ఏర్పాటు చేసింది. దీనిపై పరిశోధన సాగించిన కమిటీ నివేదికను సమర్పించింది.
మెట్రో టివి సురేష్