కరోనా లాక్ డౌన్ సమయంలో ప్రజలు ఆకలికి అలమటించకుండా ఉండటం కోసం రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ రేషన్ కార్డు కలిగిన కుటుంబంలోని ప్రతి వ్యక్తికి 12 కిలోల బియ్యం ఉచితంగా అందిస్తున్నారు. ప్రభుత్వం నుండి బియ్యం సహాయం అందని అభాగ్యులు చాలా మంది మిగిలిపోతున్నారు.
ఇలాంటి అభాగ్యులను ఆదుకోవాలన్న సంకల్పంతో స్థానిక తహశీల్దార్ కృష్ణారెడ్డి ‘అక్షయ పాత్ర’ను సృష్టించారు. దీని ప్రకారం రేషన్ దుకాణాల ద్వారా బియ్యాన్ని లబ్ది పొందుతున్న వారు తమ గ్రామంలో ఎలాంటి ప్రభుత్వ సహాయం అందని వారిని ఆదుకుని వారి ఆకలిని తీర్చాలనుకుంటే వారు అక్షయ పాత్ర ను ఉపయోగించుకోవచ్చు.
మండలంలోని ప్రతి రేషన్ దుకాణం దగ్గర ఒక డ్రమ్ము లేదా సంచి ఉంటుంది. ప్రజలు ఎవరైనా బియ్యం రాని వారికి పంచాలనుకుంటే వీటిలో బియ్యం వేయాలి. ఈ ప్రక్రియ రేషన్ దుకాణాలు అని చేసే వేళల్లో కొనసాగుతుంది. కాగా అక్షయ పాత్రకు అపూర్వ స్పందన ఉన్నట్లుగా రెవెన్యూ అధికారులు తెలుపుతున్నారు. ప్రభుత్వ గుర్తింపు లేని వలస కూలీలు, రేషన్ కార్డు రహిత కుటుంబాల వారికి అక్షయ పాత్ర ద్వారా సేకరించిన బియ్యాన్ని పంపిణీ చేస్తామని వారు తెలుపుతున్నారు.
ఎవరూ ఆకలితో అలమటించకూడదు: కృష్ణారెడ్డి
కరోనా లాక్ డౌన్ నేపధ్యంలో ఎవరు కూడా ఆకలితో అలమటించకూడదన్న ఆలోచన తో అక్షయ పాత్ర పేరుతో ఈ కార్యక్రమాన్ని రూపొందించామని తహశీల్దార్ కృష్ణారెడ్డి అన్నారు. ప్రభుత్వం అందించే ఉచిత బియ్యాన్ని అందుకోని వారు ప్రతి గ్రామంలో ఉన్నారని, వారిని ఆదుకునేందుకు అక్షయ పాత్ర ద్వారా బియ్యాన్ని సేకరిస్తున్నట్లు ఆయన తెలిపారు.
ఈ నెల 23 వరకు ఈ నెల కోటాను రేషన్ దుకాణాలు అందిస్తాయని, తరువాత వచ్చిన బియ్యాన్ని ఆయా గ్రామాల్లో లబ్దిదారులకు అందజేస్తామని అన్నారు. కేవలం సమాజ సేవలో భాగంగా ఈ కార్యక్రమాన్ని రూపొందించినట్లు కృష్ణారెడ్డి తెలిపారు.