గణేష్ నిమజ్జనం కోసం పోలీసులు పటిష్టమైన భద్రత పరమైన చర్యలు తీసుకున్నట్లు పోలీస్ కమిషనర్ విష్ణు యస్.వారియర్ తెలిపారు. ఆదివారం ఖమ్మం నగరంలోని కాల్వోడ్డు సమీపంలో గల మున్నేరులో జరుపుతున్న గణేష్ విగ్రహాల నిమజ్జనం కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ విపి. గౌతమ్ ,పోలీస్ కమిషనర్ విష్ణు యస్. వారియర్ సందర్శించారు.
ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ … కమాండ్ కంట్రోల్ ద్వారా సీసీ కెమెరాలను అనుసంధానం చేసి వాటి ద్వారా అధికారులు పర్యవేక్షణ చేస్తున్నారని తెలిపారు. ఎక్కడ ఏం జరిగినా అప్రమత్తం చేసే విధంగా చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు, వివిధ శాఖల అధికారుల సహాయ సహకారాలతో జిల్లా వ్యాప్తంగా గణేష్ నిమజ్జనం ప్రశాంత వాతావారణంలో జరిగిందన్నారు.
ఖమ్మం నగరంతో పాటు వైరా , సత్తుపల్లి, ఖమ్మం రూరల్ పరిధిలో జరిగే గణేష్ నిమజ్జన శోభాయాత్రను జిల్లా కేంద్రమైన జిల్లా పోలీస్ కార్యాలయ కమాండ్ కంట్రోల్ ద్వారా 24/7 పర్యవేక్షిస్తూ సంబంధిత పోలీస్ అధికారులకు తగిన సూచనలు చేసే విధంగా చర్యలు తీసుకున్నామని జిల్లా వ్యాప్తంగా కమ్యూనిటీ పోలీసింగ్ ద్వారా నేనుసైతం ప్రాజెక్టు కింద ఏర్పాటు చేసిన సుమారు మూడు వేల సిసి కెమెరాలను ఆయా పోలీస్ స్టేషన్ లకు అనుసంధానించడం ద్వారా కమాండ్ కంట్రోల్ సెంటర్ నుండి నిరంతర పర్యవేక్షణ చేసే విధంగా ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు.
కార్యక్రమంలో డీసీపీ ఇంజరాపు పూజ, అడిషనల్ డీసీపీ లా&ఆర్డర్ సుభాష్ చంద్ర బోస్ , ఏసీపీలు రామోజీ రమేష్ , అంజనేయులు, రామనుజం ఇతర అధికారులు పాల్గొన్నారు.