దక్షిణ అయోధ్యగా ప్రఖ్యాతిగాంచిన భద్రాద్రి పుణ్యక్షేత్రంలో సీతారాముల కల్యాణం అత్యంత వైభవోపేతంగా నిర్వహించేందుకు ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. కరోనా కారణంగా నిలిపివేసిన భక్తుల రాకను ఈ సారి సడలించారు.
రెండేళ్ల తర్వాత సీతారాముల కల్యాణ వైభవాన్ని కనులారా చూసేందుకు భక్తులను అనుమతించారు. శ్రీరామనవమి తిరుకల్యాణ బ్రహ్మోత్సవాల్లో నేటి నుంచి ప్రధాన ఘట్టాలు ఆవిష్కృతం కానున్నాయి. ఎదుర్కోలు మహోత్సవం ఇవాళ సాయంత్రం జరగనుండగా కమనీయమైన జగదభి రాముడు – సీతమ్మదేవి కల్యాణమహోత్సవం ఆదివారం జరగనుంది.
శ్రీ రామస్మరణతో భద్రాచలం పులకించిపోతోంది. లోక కల్యాణంగా భావించే జగదభి రాముడి జగత్ కల్యాణ వేడుకను కనులారా వీక్షించేందుకు లక్షలాదిగా భక్తులు భద్రాద్రి రామయ్య క్షేత్రానికి ఈ సారి భారీగా తరలిరానున్నారు. కల్యాణ మహోత్సవానికి ముందు రోజు నిర్వహించే ఎదుర్కోలు మహోత్సవానికి మిథిలా మైదానంలో అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.