సమాజంలోని కులాలు.. వర్గాలు.. ప్రాంతాలకు అతీతంగా హిందువులందరూ సంఘటితమైతే హిందూ వ్యతిరేక శక్తులు తోక మూడుస్థాయి అని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ అన్నారు. హిందువుల్లో ఉన్న కులాల ను ఆసరాగా చేసుకుని కొంతమంది విభజించు పాలించు అనే రీతిలో వ్యవహరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
హిందూ సంఘాలు, సంస్థలు ఏకమైతే రాజ్యాధికారం సులభమవుతుందని అభిప్రాయపడ్డారు. సంఘ పెద్దల సూచనలు, సలహాలు పాటిస్తూ… ధర్మకార్యం కోసం ముందుకు సాగుతానని ఎంపీ అరవింద్ అన్నారు. పెద్దల మార్గదర్శకాలు నిత్యం ఉండాలని ఆయన కోరారు. గురువారం విశ్వహిందూ పరిషత్ రాష్ట్ర కార్యాలయాన్ని నిజామాబాద్ ఎంపీ సందర్శించారు.
విశ్వహిందూ పరిషత్ జాతీయ సంయుక్త కార్యదర్శి రాఘవులు, రాష్ట్ర కార్యదర్శి బండారి రమేష్, రాష్ట్ర అధ్యక్షులు రామ రాజు, రాష్ట్ర కార్య అధ్యక్షులు సురేందర్ రెడ్డి వారిని ఆహ్వానించి సత్కరించారు. ఈ సందర్భంగా రాఘవులు మాట్లాడారు.
నిజామాబాద్ జిల్లాలో హిందూ కార్యం మరింత పెరగాలని, దానికి అరవింద్ నేతృత్వం వహించాలని కోరారు. బండారు రమేష్ మాట్లాడుతూ.. ఎంపీ అరవింద్ పట్టుదల, క్రమశిక్షణ గల వ్యక్తి అని అన్నారు. సాక్షాత్తు ముఖ్యమంత్రి కేసీఆర్ కూతురు కవితను ఓడించడం అంటే ముఖ్యమంత్రినే ఓడించడం అన్నారు.
రైతు సంక్షేమం కోసం నిరంతరం పోరాడుతూ, పసుపు బోర్డు ను సాధించిన ఘనత అరవింద్ కే దక్కుతుందని పేర్కొన్నారు. పరివార క్షేత్రాలను కలుపుకుని వెళ్లి గొప్ప నాయకుడిగా ఎదగాలని ఆకాంక్షించారు. విశ్వహిందూ పరిషత్ & భజరంగ్ దళ్ నాయకులు కన్నా భాస్కర్, జగదీశ్వర్, రాజేశ్వర్ రెడ్డి, సోమన్న, లక్ష్మీ శేఖర్, ప్రసాద్, పగుడా కుల బాలస్వామి, శివరాం రామ్, కుమార స్వామి, వాణి సక్కుబాయి, జీవన్ తదితరులు అరవింద్ తో పలు అంశాలపై చర్చించిన కార్యక్రమంలో ఉన్నారు.