తెలంగాణ రాష్ట్రంలో దళిత బిడ్డలందరికీ దళిత బంధు పథకం అమలు చేయాలని కోరుతూ శుక్రవారం తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ కార్యదర్శి సింగిరెడ్డి సోమశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ సి ఐ ఎల్ లోని అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం సమర్పించారు.
ఈ సందర్భంగా సింగిరెడ్డి సోమశేఖర్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో 16 షెడ్యూలు కులాల రిజర్వుడ్ నియోజక వర్గాలు ఉన్నాయని, కనీసం ఆ 16 నియోజకవర్గాలలో నైనా దళిత బంధు పథకం అమలు చేయకుండా దళితుల ఆత్మగౌరవంతో ముఖ్యమంత్రి కేసీఆర్ ఆడుకుంటున్నారని విమర్శించారు. శాసన సభ్యులందరూ రాజీనామా చేసే విధంగా దళితులు ఒత్తిడి తేవాలని ఆయన సూచించారు.
హుజూరాబాద్ నియోజకవర్గం లోనే దళిత బంధు అమలు చేస్తామని, ఇది ఎన్నికల స్టంట్ అని ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి పేర్కొనడం విచిత్రంగా ఉందని ఆయన అన్నారు. రాష్ట్రంలో అన్ని ప్రాంతాలను సమానంగా చూడవలసిన ముఖ్యమంత్రి ఒక ప్రాంతానికి ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ప్రాముఖ్యత ఇవ్వడంలోనే రాజకీయం ఏమిటో అర్థమవుతుందని ఆయన విమర్శించారు.
కల్లబొల్లి మాటలతో ప్రజానీకాన్ని మభ్యపెడుతున్న టిఆర్ఎస్ ప్రభుత్వాన్ని గద్దె దించే రోజులు దగ్గర పడుతున్నాయని అన్నారు. దళితులంతా ఐక్యమై దళిత బంధు సాధించుకోవడం కోసం తమ పోరాటంలో భాగస్వాములు కావాలని కోరారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు గడ్డం యాదగిరి, టిల్లు యాదవ్, బిఎస్ టి సాయి కుమార్, పంజాల బాబు గౌడ్, కమలాకర్ తదితరులు పాల్గొన్నారు.