ప్రముఖ పర్యాటక కేంద్రంగా ఉన్న విశాఖపట్నం లోని వేల కోట్ల విలువైన ప్రభుత్వ ఆస్తులను ప్రభుత్వ పెద్దల బంధువులకు అప్పనంగా కట్టబెడుతున్నారని జనసేన పక్ష నేత పీతల మూర్తి యాదవ్ ఆరోపించారు.
రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్ నియోజకవర్గ పరిధిలోనే వుండి ఆ శాఖకు కోట్లు కురిసిస్తున్న కాటేజీలను ఆయన ప్రమేయం లేకుండానే వైసీపీలో కీలక నేత అధికారులకు నేరుగా ఆదేశాలిచ్చి కూల్చేస్తున్నారని ఆయన అన్నారు. ప్రతి ఏటా ప్రభుత్వానికి 30 కోట్లు ఆదాయం ఇస్తున్న రుషి కొండ పర్యాటక కాటేజీలు పై కన్నేశారని, మూడో కంటికి తెలియకుండా కోట్ల విలువైన కాటేజ్ ల కూల్చివేతను ప్రారంభింపజేశారని ఆయన అన్నారు.
మంత్రి ప్రమేయం లేకుండానే కూల్చివేతలు కొనసాగుతుండటం ప్రభుత్వం లో ఆయన నిస్సహాయతను బట్టబయలు చేస్తోందని పీతల మూర్తి యాదవ్ ఆరోపించారు.
రాజ్యసభ సభ్యుడు విజయ సాయి రెడ్డి తన కుమార్తెను నేహా రెడ్డి ప్రారంభించిన క్రూయీజ్ పర్యాటక ప్రాజెక్ట్ కోసం రుషికొండ కాటేజీలను కూల్చివేస్తున్నట్లు మొదటి నుంచి ఆరోపణలున్నాయని ఆయన తెలిపారు. రుషికొండ లో ఆమె ఏర్పాటు చేయదలచిన క్రూయిజ్ షిప్ ప్రాజెక్టు కు ఈ కాటేజీలు స్థలం అవసరమని అందులో భాగంగానే కూల్చేసి కొత్త కట్టడాలు నిర్మిస్తున్నారని తెలుస్తోందని పీతల మూర్తి యాదవ్ ఆరోపించారు.
పర్యాటక శాఖ పేరిట ముందు టెండర్లు పిలిచి తర్వాత ప్రాజెక్టును నేహా రెడ్డి కి కట్టపెట్టే కుట్రలో భాగంగానే ఈ కూల్చివేతే కు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని ఆయన ఆరోపించారు.
అందుకోసమే ఇటీవలే మూడు కోట్ల రూపాయలను కాటేజ్ ల అభివృద్ధి కోసం ఖర్చు పెట్టిన అంశాన్ని కూడా లెక్కచేయకుండా కూల్చి వేస్తున్నారని ఆయన వివరించారు.
కాటేజీలకు ఎదురుగా ఉన్న విహార్ రెస్టారెంట్ సీ ఆర్ జడ్ నిబంధనలకు విరుద్ధమని, దానిని తొలగించాలని హైకోర్టు ఆదేశించి నప్పటికీ పట్టించుకోకుండా దాని యాజమాన్యానికి రెండు కోట్ల రూపాయలను పరిహారంగా ప్రభుత్వ నిధులను హడావుడి గా కేటాయించి ప్రైవేటు సెటిల్ మెంట్ చేయడం అవినీతికి బహిర్గతం చేసిందని పీతల మూర్తి ఆరోపించారు.
ఈ తొందర అంతా విజయసాయిరెడ్డి కుమార్తె కోసమే అని, ఒక పక్క నవరత్నాలు డబ్బులు లేకపోయినా ప్రైవేట్ వ్యక్తులు కు కోట్ల రూపాయలు ఖజానా నుంచీ కేటాయించడం ఆశ్చర్యం కలిగిస్తున్నదని ఆయన తెలిపారు. అరబిందో ఫార్మా అధినేత రాంప్రసాద్ రెడ్డి కి ముడసర్లోవను కట్టపెట్టే ప్రయత్నం చేశారని ఆయన ఆరోపించారు.
కైలాసగిరి కొండ ను కూడా ఇడుపులపాయ కు చెందిన ఒక వ్యక్తికి కట్టబెట్టారని తెలియవచ్చిందని ఆయన ఆరోపించారు. స్కైటవర్ నిర్మాణం పేరుతో కైలాస గిరి పై సర్వ హక్కులను ఇడుపులపాయ రెడ్డిగారికి అప్పగించారని, దీంతోపాటు జూ పార్క్ వెనక ఉన్న డాల్ఫినీరియంను కూడా మరో బడా బాబుకు కట్టబెట్టే ప్రయత్నాలు సాగుతున్నాయని పీతల మూర్తి యాదవ్ ఆరోపించారు.
ఉత్తరాంధ్ర ప్రజా ప్రతినిధులు ఇప్పటికైనా మేల్కొని పార్టీ లకు అతీతంగా అధికార పార్టీ నాయకుల అరాచకాలను అడ్డుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు.