గ్రామ అభివృద్ధి సంపూర్ణ బాధ్యత మీదేనని, గ్రామాలలో పెండింగులో ఉన్న పనులన్నీ అధికారుల సమన్వయంతో పూర్తి చేయించాలని ఆయా గ్రామ సర్పంచ్ లకు రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు హితవు పలికారు.
జిల్లా కేంద్రమైన సిద్ధిపేట మంత్రి నివాసంలో గురువారం ఉదయం సిద్ధిపేట రూరల్ మండలంలోని ప్రజాప్రతినిధులు, మండల అధికారులు, ఆయా గ్రామాల ప్రజాప్రతినిధులతో అభివృద్ధి పనుల పురోగతి పై సుదీర్ఘంగా మంత్రి సమీక్షించారు. మండల పరిధిలోని గ్రామాల వారీగా చేపట్టిన, చేపట్టాల్సిన అభివృద్ధి పనులపై ప్రజాప్రతినిధులు, అధికారులను ఆరా తీశారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..సర్పంచ్ లంతా టీమ్ లీడర్ గా వ్యవహరించి అసంపూర్తి పనులపై అధికారులు, గ్రామ పంచాయతీ వార్డు సభ్యులతో చర్చించాలని సూచించారు. పలు గ్రామాలలో చేపడుతున్న పనులపై అధికారులకు కనీస పర్యవేక్షణ కొరవడిందని పనితీరు మార్చుకోవాలని, గ్రామ ప్రజాప్రతినిధులు, పంచాయతీ రాజ్ శాఖ అధికారులను మంత్రి సుతిమెత్తగా ఆదేశించారు.
మిషన్ భగీరథ తాగునీరు, విద్యుత్, వైకుంఠ ధామాలు, సెగ్రీ గేషన్ షెడ్- డంప్ యార్డులు, పల్లె ప్రకృతి వనం, కొత్త పంచాయతీ భవనాలు, గ్రామాల్లోని పలు కుల సంఘ భవనాల నిర్మాణాల ప్రగతి పనులన్నీ త్వరితగతిన చేపట్టాలని ఆయా శాఖాధికారులను మంత్రి ఆదేశించారు.
సమీక్షా సమావేశంలో ఎమ్మెల్సీ ఫారూఖ్ హుస్సేన్, సుడా చైర్మన్ మారెడ్డి రవీందర్ రెడ్డి, ఆత్మ కమిటీ చైర్మన్ ప్రభాకర్ వర్మ, డీపీఓ పార్థసారథి, ఆర్ డబ్ల్యూఎస్ ఎస్ఈ శ్రీనివాస చారి, డీఈ నాగభూషణం, పంచాయతీ రాజ్ శాఖ ఏఈ చారి, ఏంపీడీఓ సమ్మిరెడ్డి, ఇతర ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.