నల్గొండ జిల్లా నకిరేకల్ నియోజకవర్గంలో కరోనా వైరస్ ప్రబల కుండా వ్యాధి నియంత్రణకు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో ఆర్ డి ఓ, డిఎస్ పి తదితరులు పాల్గొన్నారు.
అనంతరం అధికారులతో పట్టణంలోని ప్రధాన కూడళ్లను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే చిరుమర్తి మాట్లాడుతూ కరోనా మహమ్మారి విలయతాండవానికి ప్రపంచ దేశాలన్నీ చేతులెత్తేసాయని, అయితే మన ప్రధాని రాష్ట్ర ముఖ్యమంత్రి ముందు చూపుతో లాక్ డౌన్ ను ప్రకటించి కొంతమేరకు కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టగలిగారని అన్నారు.
జిల్లాలో కరోనా వైరస్ వేగంగా విస్తరిస్తుందని అందువల్ల ప్రజలంతా మరింత అప్రమత్తంగా ఉండాలని ఆయన పిలుపునిచ్చారు. పక్క జిల్లా అయిన సూర్యాపేటలో కరోనా వైరస్ వ్యాప్తి ఏ విధంగా ఉన్నదో రోజూ చూస్తూనే ఉన్నామని ఆ పరిస్థితి మనకు రాకుండా జాగ్రత్త పడాలని ఎమ్మెల్యే సూచించారు.
నకిరేకల్ నియోజకవర్గం నుండి చాలా మంది వ్యాపారులు రోజు సూర్యాపేటకు వెళ్తుంటారు, అనేక మంది కూరగాయల వ్యాపారులు నకిరేకల్ కి వస్తుంటారు ఇది అంటువ్యాధి కనుక ఒకరి నుండి ఒకరికి సోకే అవకాశలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి సూర్యాపేటకు వెళ్లే దారులన్నీ మూసివేయాలని నిర్ణయించుకున్నాం అని ఎమ్మెల్యే తెలిపారు.
సూర్యాపేట నుండి నకిరేకల్ కు రాకుండా చుట్టూ మూసి ప్రాజెక్ట్ మీద మిగతా 8చోట్ల బార్డర్ లలో బారికేడ్లను ఏర్పాటు చేస్తామని ఆయన వెల్లడించారు. పోలీసులకు, అధికారులకు పూర్తి స్థాయిలో ప్రజలు సహకరించాలని ఆయన కోరారు.