పదవ తరగతి పరీక్షలను సజావుగా ప్రశాంత వాతావరణంలో విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా పరీక్షా కేంద్రాల్లో అన్ని ఏర్పాట్లను చేసి పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ పి ఉదయ్ కుమార్ అధికారులను ఆదేశించారు. శనివారం నాగర్ కర్నూలు కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో అదనపు కలెక్టర్ ఎస్ మోతిలాల్ తో కలిసి పదోవ తరగతి పరీక్షల నిర్వహణపై జిల్లా విద్యాశాఖ అధికారి అధ్యక్షతన కలెక్టర్ సంబంధిత అధికారులతో సమన్వయ సమావేశాన్ని నిర్వహించారు.
జిల్లాలో జిల్లాలో 61 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేయగా అందులో ఏ క్యాటగిరిలో 46 పరీక్ష కేంద్రాలు, బి కేటగిరిలో 9 పరీక్ష కేంద్రాలు సి కేటగిరిలో 6 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. బి క్యాటగిరి కేంద్రాలను పోలీస్ స్టేషన్ లేదా పోస్ట్ ఆఫీస్ ఏదో ఒకటి అందుబాటులో ఉన్న కేంద్రాలుగా గుర్తించడం జరిగిందని, సి క్యాటగిరిలో పోలీస్ స్టేషన్ మరియు పోస్ట్ ఆఫీస్ రెండు కూడా అందుబాటులో లేని కేంద్రాలుగా గుర్తించడం జరిగిందని తెలిపారు.
జిల్లావ్యాప్తంగా 295 పాఠశాలల నుండి 10,650 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కానున్నారని, అందులో 78 మంది విద్యార్థులు ఇదివరకే పరీక్షల్లో తప్పిన ప్రైవేటుగా పరీక్షలకు హాజరుకానున్నట్లు, రెగ్యులర్ విద్యార్థులు 10,572 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకానున్నట్లు, జిల్లా విద్యాశాఖ అధికారి గోవిందరాజులు కలెక్టర్ కు వివరించారు. ఏప్రిల్ 3వ తేదీ నుండి ఏప్రిల్ 13వ తేదీ వరకు జరగనున్న పదోవ తరగతి పరీక్షలు ఉదయం 9:30 గంటలనుండి మధ్యాహ్నం 12:30గంటల వరకు నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ కు విద్యాధికారి వివరించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ పి.ఉదయ్ కుమార్ మాట్లాడుతూ… ఏప్రిల్ 3వ తేదీ నుండి ఏప్రిల్ 13వ తేదీవరకు నిర్వహించే 10వ తరగతి పరీక్షలకు అధికారులు సమన్వయంతో పనిచేసి విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా పరీక్షా కేంద్రాల్లో అన్ని వసతులు కల్పించి పరీక్షలను విజయవంతం చేయాలన్నారు. ఆర్టీసీ అధికారులు గ్రామీణ ప్రాంతాల నుండి పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు అసౌకర్యం కలగకుండా బస్ లను సకాలంలో నడపాలని, విద్యుత్ శాఖ నిరంతర విద్యుత్ సరఫరాను పరీక్షల సమయంలో ఆటంకం కలగకుండా చర్యలు తీసుకోవాలన్నారు.
పంచాయతీ, మున్సిపల్ శాఖ అధికారులు శానిటేషన్ చేపట్టాలని, త్రాగునీరు సౌకర్యం కల్పించాలన్నారు. ఎండల తీవ్రత ఎక్కువ ఉన్నందున విద్యార్థులకు డీహైడ్రేషన్ సమస్య ఒప్పందం కాకుండా ముందస్తుగానే వైద్య శాఖ శిబిరాలు ఏర్పాటు చేయాలన్నారు. డిహైడ్రేషన్ పై విద్యార్థులకు అవగాహన కల్పించాలని ఆదేశించారు. 144 సెక్షన్ అమలులో ఉంటుందని, ఫ్లయింగ్ స్క్వాడ్ పర్యవేక్షిస్తుందన్నారు.
12 పోలీస్ స్టేషన్ పరిధిలో 18 రూట్ లకు పోలీస్ శాఖ పర్యవేక్షణలో కట్టుదిట్టమైన భద్రతా సిబ్బందితో ప్రశ్నపత్రాలు పరీక్ష కేంద్రాలకు అందించడం, జవాబుపత్రాలు ప్యాకింగ్ పటిష్టంగా సిసి కెమెరాల పర్యవేక్షణలో ప్రశ్నపత్రాలను ఓపెన్ చేసి పరీక్షలను చేపట్టాలన్నారు. చీఫ్ సూపరింటెండెంట్ లతో సమన్వయ సమావేశం నిర్వహించాలని, ఇన్విజిలేటర్స్ అదనంగా ఏర్పాటు చేసుకోవాలన్నారు.
అదేవిధంగా విద్యార్థులు పరీక్షలకు ఒత్తిడికి గురి కాకుండా పరీక్షలను రాయాలన్నారు. అనుకోకుండా విద్యార్థులు పరీక్షల్లో తప్పిన మనోధైర్యంతో ఉండాలన్నారు. రెండు మూడు మాసాల్లోనే సప్లమెంటరీ పరీక్షలు ఉంటాయని సప్లమెంటరీలో ఉత్తీర్ణత సాధించవచ్చు అని, విద్యార్థులు ఎవరు కూడా క్షణికావేశానికి లోనై అగత్యాలకు పాల్పడకూడదని, ప్రాణం పరీక్షల కన్నా విలువైందని కలెక్టర్ సూచించారు. పదో తరగతి పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు మానసిక పరివర్తతపై సాధించేలా మానసిక నిపుణులను ఏర్పాటు చేసి వారి ఫోన్ నెంబర్లను అందుబాటులో ఉంచాలని డిఈవో ను కలెక్టర్ ఆదేశించారు.
ఎండాకాలం దృష్టిలో ఉంచుకొని పరీక్షా కేంద్రాల్లో అన్ని వసతులు కల్పించాలని ఆదేశించారు. ఈ సమీక్ష సమావేశంలో అదనపు కలెక్టర్ ఎస్ మోతిలాల్, విద్యాశాఖ అధికారి గోవిందరాజులు, డిపిఓ కృష్ణ, డిపిఆర్ఓ సీతారాం, ఆర్టీవో ఎర్రి స్వామి, పరీక్షల నిర్వహణ అధికారి రాజశేఖర్ రావు, ఆర్టీసీ డిఎం ధరమ్ సింగ్, డీఎస్పీ మోహన్, విద్యుత్, పంచాయతీ, పోస్టల్ సూపర్డెంట్, పోలీస్ వైద్యశాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.