విద్య వైద్యం, వ్యవసాయ రంగాలకు అధిక ప్రాధాన్యం ఇస్తున్న ప్రభుత్వం వెనుకబడిన పల్నాడు అభివృద్ధికి ఏదైనా భారీ ప్రాజెక్టు చేపట్టాలని ఆలోచన చేసింది. ఈ నేపథ్యంలో నరసరావుపేట పార్లమెంట్ సభ్యులు లావు కృష్ణ దేవరాయలు పల్నాడు లో మెడికల్ కాలేజీ నిర్మాణ ఆవశ్యకతను కేంద్ర ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్లారు.
గురజాల ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి ప్రత్యేక శ్రద్ధ తీసుకొని పల్నాడు వైద్యరంగంలో మిగతా ప్రాంతాల కంటే ఎంత వెనకబడి పోయింది అన్న విషయాన్ని గణాంకాలతో సహా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లారు.
ఈ నేపథ్యంలో పల్నాడు ప్రజా సమస్యలపై అవగాహన కలిగిన రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పల్నాడుకు భారీ మెడికల్ కళాశాలను మంజూరు చేశారు. మెడికల్ కాలేజ్ నిర్మాణానికి స్థల సేకరణ కై నిధులు మంజూరు చేశారు.
గురజాల ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి మెడికల్ కాలేజీ స్థల సేకరణ కోసం అధికార యంత్రాంగాన్ని పరుగులు పెట్టించారు. ఆయనకు గురజాల ఆర్డీవో పార్థసారథి సహకారం తోడవడంతో రాష్ట్రంలోని మిగతా మెడికల్ కాలేజీల స్థల సేకరణ కంటే ఎంతో ముందుగానే హైవే పక్కన రైతులను ఒప్పించి పొలాలు కొనుగోలు చేసి మెడికల్ కాలేజీ నిర్మాణానికి స్థల సేకరణ పూర్తి చేశారు.
అంతేగాక పొలాల విక్రయాలకు సంబంధించిన నగదు ప్రభుత్వం నుండి నేరుగా రైతుల ఖాతాల్లోనే జమ అయ్యే విధంగా ఏర్పాటు చేశారు. తాజాగా రైతుల ఖాతాల్లో 12 కోట్లు ప్రభుత్వం జమ చేయడంతో మెడికల్ కాలేజీ శంకుస్థాపనకు రంగం సిద్ధమైంది.
మెడికల్ కాలేజ్ నిర్మాణానికి ప్రభుత్వం వేగంగా పావులు కదపడం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తం అవుతోంది. సాధ్యమైనంత త్వరలో మెడికల్ కాలేజీ నిర్మాణం పూర్తి చేసి వెనకబడిన పల్నాడు కు ఆధునిక వైద్య సదుపాయాలు అందుబాటులోకి తీసుకురావాలని ప్రజలు కోరుతున్నారు.