కడప జిల్లా సిద్దవటం మండలంలోని లింగంపల్లి గ్రామానికి చెందిన జింకా చంద్రబాబు(45) కరోనా సోకి కడప రిమ్స్ లో చికిత్స పొందుతూ ఈ నెల19వ తేదీన మృతి చెందాడు.
ఈ నెల 15వ తేదీన చంద్రబాబు కు కరోనా సోకడంతో కడప రిమ్స్ ఆస్పత్రిలో ఐసియూ లో చేరాడు. అతని భార్య లక్ష్మీదేవి కూడా కరోనాతో బాధపడుతూ ఈ నెల 17వ తేదీన కడప రిమ్స్ ఆస్పత్రిలో చేరింది.
చంద్రబాబు తల్లి జింకా లక్షుమ్మ ఈ నెల 9వ తేదీన కరోనాతో మృతి చెందింది. ఆమె కర్మ కాండల కార్యక్రమంలో చంద్రబాబు పాల్గొనడంతో చంద్రబాబుకు కరోనా సోకింది.
దీనితో చంద్రబాబు రిమ్స్ ఆస్పత్రిలో చేరి చికిత్సపొందుతూ ఈ నెల 19వ తేదీన మృతి చెందగా అతని భార్య జింకా లక్ష్మీదేవి కూడా కరోనా సోకడంతో చికిత్సపొందుతూ నెల 22వ తేదీన రాత్రి రిమ్స్ ఆస్పత్రిలో మృతి చెందింది.
చంద్రబాబు తండ్రి చంద్రాయుడుకు కూడా ఈ నెల 19వ తేదీన కరోనా సోకడంతో రిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా ఆయన పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. మృతుడు చంద్రబాబు,లక్ష్మీదేవి లకు ముగ్గురు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు.
వారిలో హిమసాయి, జయంతి అనే ఇరువురు కుమార్తెలు వివాహాలయ్యాయి. మూడవ కుమార్తె జింకా దివ్య కడప ప్రభుత్వ బాలికల కళాశాలలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుకొంటుండగా, కుమారుడు జింకా భగీరధ్ కడప శాంతినికేతన్ లో 6వ తరగతి చదువుకొంటున్నాడు..
కరోనా కారణంగా తండ్రి చంద్రబాబు ,తల్లి లక్ష్మీదేవి లు మృతి చెందగా వారి పిల్లలు చివరిచూపుకు కూడా నోచుకోలేదు. వారి మరణంతో పిల్లలు అనాధాలుగా మిగిలారు.
చంద్రబాబు కు ఉన్న 2 ఎకరాల భూమిని అప్పులు తీర్చేందుకు అమ్ముకున్నాడని పిల్లలకు ఏ ఆధారం లేకుండా పోయిందని వారికి దిక్కెవరని స్థానికులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు….