రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్ తహశీల్దార్ విజయారెడ్డిపై ఓ దుండగుడు పెట్రోల్ పోసి సజీవ దహనం చేసిన ఘటనపై రెవెన్యూ ఉద్యోగ సంఘాలు తీవ్రంగా నిరసన వ్యక్తం చేశాయి. ఈ దారుణం గురించి తెలియగానే భారీ సంఖ్యలో రెవెన్యూ ఉద్యోగులు అబ్దుల్లాపూర్ మెట్ తహశీల్దార్ ఆఫీస్ దగ్గరకు చేరుకున్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ హైదరాబాద్ – విజయవాడ హైవేపై బైఠాయించారు. దీంతో కొద్ది సేపు ట్రాఫిక్ నిలిచిపోయింది. హైవేపై భారీగా వాహనాలు నిలిచిపోవడంతో పోలీసులు వారికి సర్దిచెప్పి.. నిరసన విరమింపజేశారు. ఇది అత్యంత దుర్మార్గమైన, హేయమైన చర్య అని తెలంగాణ రెవెన్యూ ఎంప్లాయీస్ సర్వీసెస్ అసోసియేషన్ (ట్రెసా) అధ్యక్షుడు వంగా రవీందర్ రెడ్డి అన్నారు. ఈ దారుణ ఘటనపై నిరసనగా రాష్ట్రంలోని రెవెన్యూ ఉద్యోగులంతా విధులను బహిష్కరించారని చెప్పారాయన. మంగళవారం విజయారెడ్డి అంతిమ యాత్ర లో పాల్గొనడానికి హైదరాబాద్, CCLA కార్యాలయానికి రావాలని రెవెన్యూ ఉద్యోగులకు ఆయన పిలుపునిచ్చారు. ఆమె మృతికి సంతాపంగా మూడు రోజుల పాటు విధులను బహిష్కరించి నిరసన తెలపాలన్నారు. దోషుల వెనక ఉన్న అసలు కుట్రదారులను గుర్తించి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు ట్రెసా అధ్యక్షుడు. ప్రభుత్వం రెవెన్యూ ఉద్యోగులుకు, ముఖ్యంగా మహిళా ఉద్యోగుల రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు. త్వరలోనే తమ తదుపరి కార్యాచరణ నిర్ణయిస్తామని తెలిపారు. అబ్దుల్లాపూర్మెట్ తహశీల్దార్ విజయరెడ్డి హత్య అత్యంత దారుణమని డిప్యూటీ కలెక్టర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు లచ్చిరెడ్డి అన్నారు. ఇటువంటి ఘటనలు మరోసారి జరగకుండా పోరాడాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారాయన. అన్ని క్యాడర్ల రెవెన్యూ ఉద్యోగులంతా వెంటనే హైదరాబాద్ తరలిరావాలని, విజయారెడ్డికి నివాళి అర్పించాలని అన్నారు.
previous post