తిరుమల శ్రీవారి ప్రత్యేక దర్శన టికెట్లను శుక్రవారం ఉదయం 10 గంటలకు టీటీడీ విడుదల చేసింది. భక్తులు కేవలం 60 నిమిషాల్లోనే 5,06,600 టికెట్లు బుక్ చేసేసుకున్నారు. టికెట్ బుకింగ్ సమయంలో ఎలాంటి అంతరాయం ఏర్పడకపోవడంతో కేవలం విడుదల చేసిన గంటలోనే బుక్ చేసుకున్నారు. ముఖ్యంగా బుకింగ్ సమయంలో జియో మార్ట్ క్లౌడ్ టెక్నాలజీ సహకారం అందించడంతో..భక్తులకు బుకింగ్ అవస్థలు తప్పినట్లు తెలుస్తోంది.
డిసెంబర్ నెలకు సంబంధించిన ప్రత్యేక ప్రవేశ రూ.300 దర్శన టికెట్ల విక్రయం ద్వారా టీటీడీకి రూ.15.20 కోట్ల ఆదాయం లభించినట్లు టీటీడీ అధికారులు తెలిపారు. డిసెంబర్ కు కు సంబంధించిన రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను టీటీడీ ఇవాళ విడుదల చేసింది. ఇందుకు సంబంధించిన టికెట్లను ఆన్లైన్లో అందుబాటులో ఉంచి..ఈ దర్శన టికెట్లను బుక్ చేసుకోవాలని టీటీడీ ఓ ప్రకటనలో పేర్కొన్న సంగతి తెలిసిందే. మరోవైపు తిరుమల తిరుపతిలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. గురువారం శ్రీవారిని 61,304 మంది భక్తులు దర్శించుకున్నారు. శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.46 కోట్లు లభించింది. మరోవైపు 31 కంపార్టుమెంట్లలో భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి చూస్తున్నారు. సర్వదర్శనం చేసుకునే భక్తులకు శ్రీవారి దర్శనం కోసం సుమారు 24 గంటల సమయం పడుతున్నట్లు టీటీడీ అధికారులు ప్రకటించారు.