తెలంగాణలో రాజన్న రాజ్యం కోసం కొత్త పార్టీ పెట్టబోతున్న వైఎస్ షర్మిలను వైసీపీ నాయకులు కూడా కలుస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ లో అధికారంలో ఉన్న వైసీపీ కి చెందిన నాయకులు షర్మిలను కలవడం వార్తల్లో ముఖ్యాంశంగా మారింది.
నేడు తాజాగా మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డి వై ఎస్ షర్మిలతో భేటీ అయ్యారు. లోటస్ పాండ్లోని బ్రదర్ అనిల్ కార్యాలయంలో వీరి భేటీ జరిగింది.
ఏపి ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి దూతగా ఆయన వచ్చారని సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది. అయితే ఆయన జగన్ దూతగా వచ్చారా?
లేక వైసీపీలోని అసమ్మతి నేతల ప్రతినిధిగా వచ్చారా అనేది చర్చనీయాంశమైంది. షర్మిలతో మాట్లాడిన అనంతరం బ్రదర్ అనిల్ కుమార్తో కూడా రామకృష్ణారెడ్డి సుదీర్ఘ మంతనాలు జరిపారు.
ఆళ్ల రామకృష్ణారెడ్డి రష్మిలతో సమావేశం కావడం వెనుక ఆసక్తికరమైన కథనాలే వినిపిస్తున్నాయి. రాజకీయంగా జగన్ తో గ్యాప్ పెరిగిపోయినందున కొందరు నేతలు ప్రత్యామ్నాయం కోసం ఎదరు చూస్తున్నారు.
ఇప్పటికిప్పుడు ఎవరూ ఏం చేయలేకపోయినా దీర్ఘకాలంలో చేయాల్సిన కార్యక్రమాలకు ఇప్పటి నుంచే పునాదులు వేసుకుంటున్నారు.
ఈ నేపథ్యంలోనే ఆళ్ల రామకృష్ణారెడ్డి షర్మిల సమావేశం జరిగినట్లు విశ్వసనీయంగా తెలిసింది. ఆళ్ల రామకృష్ణారెడ్డి వారితో ఏ అంశాలపై చర్చలు జరిపారో తెలియకపోయినా ఈ సమావేశం మాత్రం భవిష్యత్తు రాజకీయాలను ప్రభావితం చేసేదిగా ఉంటుందని మాత్రం చెప్పవచ్చు.