అవినీతి కేసులు, మనీ లాండరింగ్ అభియోగాలు ఎదుర్కొంటున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి సుప్రీంకోర్టు న్యాయమూర్తి ఎన్ వి రమణపై ఆరోపణలు చేస్తూ ప్రధాన న్యాయమూర్తి ఎస్ ఏ బాబ్డేకు లేఖ రాయడం శోచనీయమని ఆలిండియా బార్ అసోసియేషన్ (ఏఐబీఏ) తెలిపింది.
సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణకు అపకీర్తి తెచ్చేలా జగన్ వ్యాఖ్యలు ఉన్నాయని, న్యాయ వ్యవస్థ ధిక్కార నేరం కింద జగన్ పై చర్యలు తీసుకోవాలని కోరింది. సుప్రీంకోర్టుకు తదుపరి సీజేఐ రేసులో ముందున్న జస్టిస్ ఎన్వీ రమణపైనా, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తులపైనా జగన్ వేసిన అపవాదులు, చేసిన దురుద్దేశ పూరిత వ్యాఖ్యలు న్యాయ వ్యవస్థ స్వతంత్రతను కుదిపేశాయని ఏఐబీఏ చైర్మన్, సీనియర్ న్యాయవాది అదీశ్ సి అగర్వాల్ అభిప్రాయపడ్డారు.
ఆ లేఖలో చూపించిన తీవ్రత, ఉద్దేశం, ఆ లేఖ రాసిన సమయం చూస్తుంటే కచ్చితంగా స్వప్రయోజనాలు ఉన్నాయనిపిస్తోందని, ఓ రహస్య అజెండాతో లేఖ రాశారని భావించాల్సి వస్తోందని అగర్వాల్ వివరించారు. జస్టిస్ ఎన్వీ రమణ రాజకీయాల నుంచి నేరపూరిత శక్తులను తొలగించాలన్న పిటిషన్ పై విచారణ చేపట్టిన సమయంలోనే ఈ లేఖ వచ్చిందని అన్నారు.
నిర్దిష్ట కేసులను విచారిస్తున్న జడ్జిలను లక్ష్యంగా చేసుకుని ఏపీ సీఎం లేఖ రాయడం ప్రమాదకరమైన చర్య అని, ఏమాత్రం విచక్షణ లేని పని అని అగర్వాల్ విమర్శించారు.