ఎవరు ఎన్ని చెప్పినా, ఎవరు ఏది చేసినా రాజధాని మారే ప్రసక్తే లేదని కేంద్రమంత్రి కిషన్రెడ్డి తేల్చి చెప్పారు. పీఎం కిసాన్ నిధులను విడుదల చేసేందుకు ఏలూరు జిల్లాకు వచ్చిన కేంద్రమంత్రి కిషన్రెడ్డి మీడియాతో మాట్లాడారు. ఏపీకి అమరావతి మాత్రమే ఏకైక రాజధాని అని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్పష్టం చేశారు.
అమరావతే రాజధాని అని ప్రధాని మోదీ చెప్పారని తెలిపారు. అమరావతికి బీజేపీ కట్టుబడి ఉందని అన్నారు. ఇతర రాజకీయ పార్టీ కార్యక్రమం చేస్తున్నప్పుడు అధికార పార్టీ రెచ్చగొట్టే చర్యలకు పాల్పడకూడదని కేంద్ర మంత్రి కిషన్రెడ్డి వ్యాఖ్యానించారు. ఇలాంటి చర్యలు ప్రజాస్వామ్యానికి వ్యతిరేకమని ఆయన అభిప్రాయపడ్డారు.
పార్టీ కార్యక్రమాలను నిర్వహించుకునే హక్కు ప్రతి రాజకీయ పార్టీకి ఉంటుందన్నారు. మహాత్మా గాంధీ స్ఫూర్తితో ప్రధాని మోదీ వ్యవసాయ రంగంపై ఎక్కువ దృష్టి పెట్టారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. వ్యవసాయదారులకు తక్కువ ధరకే ఎరువులు, విత్తనాలు అందించే ప్రయత్నం ప్రధాని మోడీ చేస్తున్నారని తెలిపారు.