అమరావతి రాజధానిపైన, రైతులు, రాజధాని ప్రాంత ప్రజలపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే చూస్తూ ఊరుకోమని, చేతులకు పని చెపుతామని, అవసరమైతే చీపురుతో దుమ్ముదులుపుతామంటూ అమరావతి మహిళా జెఎసి నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
విజయవాడలోని అమరావతి పరిరక్షణ సమితి రాష్ట్ర కార్యాలయంలో మంత్రి కొడాలి నాని చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా బుధవారం నాడు మహిళా నేతలు చీపుర్లు చేతపట్టి నిరసన వ్యక్తం చేశారు.
మంత్రి కొడాలి నాని అమరావతిపై చేసిన వ్యాఖ్యలను వెనక్కు తీసుకోవాలని..నోరు అదుపు- మాట పొదుపు లేని వారిని చీపురు’తో దుమ్ము దులుపుతామంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ గద్దె అనూరాధ మాట్లాడుతూ ఐదు కోట్ల కలల రాజధాని అమరావతిని విధ్వంసం చేసేందుకు అనేక విధాలుగా ప్రయత్నాలు చేస్తున్నారన్నారు.
అమరావతికి న్యాయవ్యవస్థ అండ
ఎవరెన్ని ప్రయత్నాలు చేసినా అమరావతే రాజధానిగా ఉంటుందని తెలిపారు. అమరావతి రాజధానికి న్యాయ వ్యవస్థ అండగా ఉందని, అమరావతి రైతులు ధైర్యంగా ఉండాలన్నారు. సీపీఐ జాతీయ మహిళా నాయకురాలు అక్కినేని వనజ మాట్లాడుతూ ప్రజలను ప్రక్కదోవ పట్టించేందుకు మంత్రులు తమ ఇష్టం వచ్చినట్లు రాజధాని విషయంలో మాట్లాడటం తగదన్నారు.
బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న మంత్రులు ప్రజలతో చాలా సౌమ్యంగా మాట్లాడాలని అలా కాకుండా ప్రజలంటే లెక్కలేకుండా నిర్లక్ష్యంగా మాట్లాడటం తగదని హితవుపలికారు. ముఖ్యంగా మంత్రి కొడాలి నాని బాధ్యతాయుతమైన పదవిలో ఉండి కూడా రాజధాని ప్రాంతం పైన, ప్రజలపైనా అనుచిత వ్యాఖ్యలు చేయడం సబబుకాదన్నారు.
మీ ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే ప్రజలు వణికిపోయి మీ కాళ్ల మీద పడరని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా మంత్రులు తమ బాధ్యతను గుర్తించి సక్రమంగా వ్యవహరించాలన్నారు. కాంగ్రెస్ పార్టీ మహిళా నాయకురాలు సుంకర పద్మశ్రీ మాట్లాడుతూ రాజకీయ లబ్ధి కోసమే కొడాలి నాని, నందిగం సురేష్, బొత్స సత్యనారాయణ మాట్లాడుతున్నారన్నారు.
జగన్ మెప్పు కోసం తప్పుడు మాటలు వద్దు
జగన్ మెప్పుకోసం, మంత్రి పదవులు కాపాడుకోవడానికే రాజదానిపై మాట్లాడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. మహిళలు శాంతియుతంగా ఆందోళన చేస్తున్నారు ఏమి చేయరని అనుకోవద్దని అవసరమైతే చేతులకు పనిచెప్పగలమని మీ నాలుకలు అదుపులో పెట్టుకోవాలని హెచ్చరించారు.
సీపీఐ మహిళా నేత పి.దుర్గాభవానీ మాట్లాడుతూ మహిళలను కించపరచే విధంగా అధికార పార్టీ మంత్రులు ఇష్టానుసాంగా మాట్లాడితే ప్రభుత్వ పెద్దలు ఎందుకు ఖండించడం లేదని ప్రశ్నించారు. మంత్రులు వారికి పనులు కోసం, ముఖ్యమంత్రి మెప్పుకోసం రైతులపైన, రాజధాని ప్రాంత ప్రజలపైన ఇష్టానుసారంగా మాట్లాడితే సహించేది లేదన్నారు.
దళిత మహిళా జెఎసి నాయకురాలు కంభంపాటి శిరీష మాట్లాడుతూ రాష్ట్రాభివృద్ధి కోసమే రైతులు భూములు ఇచ్చారని, అమరావతి కోసం ఎటువంటి ఉద్యమానికైనా రైతులు సిద్ధంగా ఉన్నారన్నారు.
అలాగే రాష్ట్ర మంత్రులు కూడా తమ ఇష్టానుసారంగా మాట్లాడవద్దని రానున్న కాలంలో తప్పకుండా ప్రజల ఆగ్రహాన్ని చవి చూడాల్సిన పరిస్థితి ఏర్పడుతుందన్నారు.
ఈ కార్యక్రమంలో లోకసత్తా మహిళా నేత మాధవి, జనసేన నాయకురాలు బాడిత పద్మ, అమరావతి పరిరక్షణ సమితి జెఎసి మహిళా నాయకులు ప్రియాంక పలువురు పాల్గొన్నారు.