మూడేళ్లలో అమరావతి నిర్మాణం పూర్తి చేస్తామని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు. రాజధాని ప్రాంతంలో మంత్రి నారాయణ నేడు పర్యటించారు. నేలపాడు సమీపంలోనీ అడ్మినిస్ట్రేటివ్ టవర్లు,హై కోర్టు రాఫ్ట్ ఫౌండేషన్ వద్ద నీటి పంపింగ్ ను పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి నారాయణ మాట్లాడుతూ 2015 జనవరి ఒకటో తేదీన ల్యాండ్ పూలింగ్ నోటిఫికేషన్ ఇస్తే కేవలం 58 రోజుల్లోనే రైతులు 34 వేల ఎకరాలు స్వచ్ఛందంగా ఇచ్చారు. ప్రపంచంలో టాప్ 5 లో ఒకటి గా చేయాలని లక్ష్యంగా పెట్టుకొని ఐకానిక్ భవనాలు డిజైన్లను నార్మన్ ఫాస్టర్ చేత చేయించాం.
అధికారులు, ఉద్యోగులు, జడ్జీలు కోసం 2019కు ముందే మొత్తం 4053 అపార్ట్మెంట్లు పనులు ప్రారంభించాం. మాపై కక్షతో గత ప్రభుత్వం నిర్మాణాలు ఆపేసింది. అసెంబ్లీని 250 మీటర్ల ఎత్తులో నిర్మించి….మిగిలిన రోజుల్లో టూరిజం స్పాట్ గా చేయాలని డిజైన్ చేశాం. రాష్ట్ర స్థాయి అధికారులు అందరూ ఒకేచోట ఉండేలా 5 అడ్మినిస్ట్రేటివ్ టవర్ లు డిజైన్ చేశాం. కోటీ 3 వేల చదరపు అడుగుల తో భవనాలు డిజైన్ చేసి పనులు ప్రారంభించాం. గత ప్రభుత్వం ఈ నిర్మాణాలు మొత్తం నీళ్ళలో పెట్టేసింది. నీళ్లలో ఉండటంతో నాణ్యత కోసం ఐఐటి నిపుణులతో అధ్యయనం చేశాం.
విద్యుత్ లైన్ లు, డ్రైనేజీలు, తాగు నీటి పైపులు అన్నీ అండర్ గ్రౌండ్ లో ఉండేలా డిజైన్ చేశాం. గత ప్రభుత్వం మొత్తం అడవిగా మార్చేసింది. న్యాయపరమైన కారణాలతో పనుల ప్రారంభ ఆలస్యం అయింది. ఇప్పటి వరకూ మొత్తం 40 పనులకు టెండర్లు పిలిచాం. జనవరి నెలాఖరు లోగా అన్నీ పూర్తి చేసి ఫిబ్రవరి రెండో వారంలో పనులు ప్రారంభిస్తాం అని ఆయన తెలిపారు.