పల్నాడు జిల్లా సత్తెనపల్లి నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్ధిగా సీనియర్ నాయకుడు కన్నా లక్ష్మీనారాయణ ఖరారు కావడంతో రాష్ట్ర మంత్రి అంబటి రాంబాబుకు దడపుట్టుకుందని అంటున్నారు. టీడీపీ సత్తెనపల్లి ఇన్ చార్జిగా కన్నా లక్ష్మీనారాయణను ప్రకటించడంతో ఉమ్మడి గుంటూరు జిల్లా రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి.
ప్రస్తుతం సత్తెనపల్లి నియోజకవర్గంపై అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురుతోంది. 2019 నాటి అసెంబ్లీ ఎన్నికల్లో తన ప్రత్యర్థి, తెలుగుదేశం పార్టీ అభ్యర్థి కోడెల శివప్రసాద్ రావును 20 వేలకు పైగా ఓట్ల తేడాతో అంబటి రాంబాబు ఓడించారు. కోడెల కన్నుమూసిన తరువాత ఆయన కుమారుడు శివరాంకు టికెట్ లభిస్తుందనే అంచనాలు
ఉన్నాయి. దీనికి భిన్నంగా అంబటి ని ఢీ కొట్టెందుకు కన్నా సరైన అభ్యర్ధి గా పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. అంబటి రాంబాబు కాపు సామాజిక వర్గానికి చెందిన నాయకుడు. అదే సామాజిక వర్గానికి చెందిన కన్నా లక్ష్మీనారాయణను బరిలోకి దింపింది టీడీపీ. నిజానికి కన్నా లక్ష్మీనారాయణ సొంత నియోజకవర్గం పెదకూరపాడు. వరుసగా అయిదుసార్లు ఆయన
ఇక్కడి నుంచి గెలుపొందారు. 2009లో గుంటూరు వెస్ట్కు మారిపోయారు. 2019 ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా నరసరావుపేట నుంచి లోక్సభకు పోటీ చేసి ఓడిపోయారు. అలాగే అంబటి రాంబాబు సొంత నియోజకవర్గం రేపల్లె. ఆయనను బలవంతంగా సత్తెనపల్లికి పంపింది వైసీపీ నాయకత్వం. ఆ ఊపులో గెలిచినా కూడా అంబటి రాంబాబుకు సత్తెనపల్లి
నియోజకవర్గం పై పట్టు రాలేదు. పట్టు రాకపోవడమే కాకుండా అక్కడ అంబటి రాంబాబు ఎంతో వ్యతిరేకత మూటగట్టుకున్నారు. కాపు, రెడ్డి సామాజిక వర్గం ఓటుబ్యాంక్ పెద్ద సంఖ్యలో ఉండే నియోజకవర్గం సత్తెనపల్లి నుంచి కన్నా లక్ష్మీనారాయణ టీడీపీ అభ్యర్థిగా పోటీ చేయడం దాదాపు ఖరారైన నేపథ్యంలో- వైఎస్ఆర్సీపీ ఎలాంటి ప్రతివ్యూహాన్ని
రూపొందిస్తుందనేది ఆసక్తిగా మారింది. సత్తెనపల్లికే చెందిన మాజీ ఎమ్మెల్యే యర్రం వెంకటేశ్వర రెడ్డి ఇటీవలే వైసీపీలో చేరిన నేపథ్యంలో ఆయనకు లేదా ఆయన కుమారుడు నితిన్ రెడ్డికి టికెట్ ఆశిస్తున్నారు. ఈ కారణాలతో అంబటి రాంబాబు సత్తెనపల్లి నుంచి వెళ్లిపోతున్నట్లేనని అంటున్నారు.