విజయసాయిరెడ్డి జన్మదినం నాడు రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కొత్త 108 అంబులెన్సులను ప్రారంభించడాన్ని వ్యతిరేకిస్తూ కడప కో అపరేటివ్ కాలనీలో బుధవారం తన నివాస గృహం వద్ద కడప నియోజకవర్గ తెదేపా బాధ్యులు వి.ఎస్.అమీర్ బాబు నిరసన తెలిపారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కుయ్ కుయ్ దోపిడీకి రయ్ రయ్ మని జెండా ఊపడం ఏ2 అప్రూవల్ గా మారకుండా ఉండేందుకే రిటర్న్ గిఫ్ట్ అని అన్నారు. కొత్త 108 అంబులెన్సులలో ముందు ఉన్న సిబ్బందిని (ల్యాబ్ టెక్నీషియన్, ఫార్మాసిస్ట్, నర్సులను) తొలగించి కేవలం ముగ్గురు సిబ్బందితోనే ప్రారంభించడం దుర్మార్గపు చర్య అని విమర్శించారు.
రూ.307 కోట్ల అంబులెన్స్ స్కామ్ కు ప్రోత్సాహమా?
విజయసాయిరెడ్డి పుట్టినరోజు నాడే ప్రభుత్వం 108 అంబులెన్సులను ప్రారంభించడం దేనికి సంకేతం? అని ప్రశ్నించారు. రూ.307 కోట్ల అంబులెన్స్ స్కామ్ కు ప్రోత్సాహమా? లేక ప్రజాధనాన్ని అప్పనంగా తనకు దోచిపెట్టిన ఏ-2కు ఇచ్చిన రిటర్న్ గిఫ్ట్ అనుకోవాలా? అని ప్రశ్నించారు.
కొత్త 108 అంబులెన్సులు రోడ్డు మీద వెళుతుంటే రూ.307 కోట్లు ప్రజా ధనం విజయసాయిరెడ్డి వియ్యకుడి ఇంటికి తరలి వెళుతున్నట్లుందని ప్రజలు భావిస్తున్నారని అన్నారు. ప్రజల ప్రాణాలను నిలబెట్టే 108 అంబులెన్స్ ల నిర్వహణ కాంట్రాక్టులో స్కామ్ జరగడం సిగ్గుచేటన్నారు. గత ఒప్పందం ప్రకారం బీవీజీ సంస్థకు 2020 డిసెంబరు 12 వరకూ కాలపరిమితి ఉంటే,15 నెలల ముందే 2019 సెప్టెంబరు 20న కొత్త ఏజెన్సీ కోసం 111 జీవో ఎందుకు తెచ్చినట్టు? అని ప్రశ్నించారు.
నేరుగా డబ్బులు చెల్లించి ఎందుకు కొన్నారు?
అంబులెన్స్ నిర్వహణ ఒప్పందం అమలులో ఉండగా 10 నెలల ముందుగానే 2020 ఫిబ్రవరి 13న జీవో 116 తో బీవీజీ సంస్థ ఒప్పందాన్ని ఎందుకు రద్దుచేశారన్నారు. ఫైనాన్స్ విధానంలో కొనుగోలు చేయగలిగిన అంబులెన్సులను జీవో 117తో నేరుగా డబ్బులు చెల్లించి ఎందుకు కొన్నారు?
ఒక్కొక్క పాత అంబులెన్సుకు రూ.47 వేలు, కొత్త అంబులెన్సుకు రూ.90 వేలు చొప్పున నిర్వహణ ఖర్చులు పెంచి… వైసీపీ ఎంపీ అల్లుడికి చెందిన సంస్థకు ఉన్నపళంగా కాంట్రాక్టులు కట్టబెట్టడంలో మతలబు ఏంటన్నారు. అవినీతి జరిగిందనడానికి ఇంతకన్నా ఆధారాలు ఏం కావాలని ప్రశ్నించారు.
హౌస్ అరెస్ట్ చేయడం ఏంటి?
అంబులెన్స్ స్కామ్ వెలుగులోకి వస్తే అవినీతికి పాల్పడిన వ్యక్తులపై చర్యలు తీసుకోవాల్సిన ప్రభుత్వం, కుంభకోణాన్ని బయటపెట్టిన తెలుగుదేశం నేత పట్టాభిరామ్ పై వేధింపులకు దిగడం ఏంటని, హౌస్ అరెస్ట్ చేయడం ఏంటి? దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు. అంబులెన్స్ నిర్వహణకు ఇప్పటివరకు బీవీజీ సంస్థ ఒక్కొక్కదానికి రూ.1,31,000లు చొప్పున అన్నిటికీ ఒకే రేటు తీసుకునేది.
అలాంటిది అరబిందోకు రేట్లు పెంచి పాత వాహనానికి నెలకు రూ.2,21,257, కొత్త వాహనాలకు రూ,1,78,072 చొప్పున… రెండు రేట్లుగా ఎందుకు విడగొట్టారన్నారు. ఈ నిరసన ప్రదర్శనలో శాప్ మాజీ సభ్యుడు జయచంద్ర, రాష్ట్ర తెదేపా ఎస్సీ నాయకులు జయకుమార్, సుబ్బారాయుడు, బాలదాసు, 26వ డివిజన్ తెదేపా ఇంచార్జ్ శివ, నాసిర్ అలీ, అనిల్ తదితరులు పాల్గొన్నారు.