కేంద్ర ప్రభుత్వం దుర్మార్గంగా తీసుకువచ్చిన కార్మిక చట్టాల సవరణ వల్ల భవన నిర్మాణ కార్మికుల మీద తీవ్రమైన ప్రభావం పడుతుందని చట్టాల సవరణను వెంటనే నిలిపివేయాలని బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రత్నాకరం కోటంరాజు డిమాండ్ చేశారు. ఖమ్మం నగరంలో ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్ లో జరిగిన సంఘం ఖమ్మం జిల్లా 13వ మహాసభలో కోటంరాజు మాట్లాడుతూ మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాల వల్ల కార్మికులు రోడ్డున పడే పరిస్థితి వచ్చిందని కేంద్ర ప్రభుత్వ చర్యలను తిప్పి కొట్టకపోతే రానున్న రోజుల్లో కార్మిక వర్గం అధోగతి పాలు కానుందని హెచ్చరించారు. భవన నిర్మాణ కార్మిక వెల్ఫేర్ బోర్డులో పెండింగ్లో ఉన్న క్లైములు అన్ని వెంటనే రిలీజ్ చేయాలని, నిర్మాణ కార్మికులకు ఇచ్చే నష్టపరిహారాలను రెట్టింపు చేయాలని కార్మికుల పిల్లలకు స్కాలర్షిప్లు ఇవ్వాలని, అడ్డాలకు స్థలాలు కేటాయించి మరుగుదొడ్లు మంచినీటి సౌకర్యం కల్పించాలని కోరారు. కార్మిక మంత్రి ప్రకటించిన మోటార్ సైకిళ్ల ను వెంటనే ఇవ్వాలని, 55 సంవత్సరాలు నిండిన భవన నిర్మాణ కార్మికుడికి బోర్డు ద్వారా నెలకు 5000 రూపాయల పెన్షన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు .
ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి కళ్యాణం వెంకటేశ్వరరావు మాట్లాడుతూ జిల్లాలో భవన నిర్మాణ సంఘం సిఐటియు ఆధ్వర్యంలో కార్మికుల కోసం పాటుపడుతుందని సంఘం ద్వారా అనేకమంది లబ్ధి పొందారని భవన నిర్మాణ కార్మిక సంఘం సిఐటియులో అందరూ చేరాలని పిలుపునిచ్చారు . ఈ మహాసభలలో జిల్లా అధ్యక్ష కార్యదర్శులు దోనోజు లక్ష్మయ్య , ముదాం శ్రీనివాసరావు , ఎర్ర శ్రీకాంత్ , పెరుమాల్లపల్లి మోహన్ రావు , ఎస్ కే జమాల్ , అమరబోయిన లింగయ్య , ఎర్ర మల్లికార్జున్ , మేడికొండ నాగేశ్వరరావు , బోయినపల్లి వీరబాబు , గూడ రాంబ్రహ్మం గౌడ్ , అరవపల్లి శ్రీను , టీఎస్ కళ్యాణ్ , పగిడి కత్తుల నాగేశ్వరరావు , భాష పొంగు వీరన్న , బుచ్చాల వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు .