ఇరాక్ రాజధాని బాగ్దాద్లోని అమెరికా రాయబార కార్యాలయం లక్ష్యంగా ఆదివారం మరోసారి రాకెట్ దాడులు జరిగాయి. ఈ విషయాన్ని పెంటగాన్ అధికారులు వెల్లడించారు. గతేడాది అక్టోబరు నుంచి అమెరికా ఆస్తులపై దాడులు జరగడం ఇది 19వ సారి అని తెలిపారు. యూఎస్ రాయబార కార్యాలయం లక్ష్యంగా ఎన్ని రాకెట్లతో దాడి జరిగిందనే విషయం ప్రకటించలేదు.
ఈ ఘటనలో తమ సిబ్బంది ఎవరూ గాయపడలేదని అన్నారు. ఈ ఘటనకు బాధ్యత వహిస్తున్నట్టు ఏ ఉగ్రసంస్థ కూడా ప్రకటించుకోలేదు. అమెరికా మాత్రం ఇది కచ్చితంగా ఇరాన్ మద్దతుదారుల పనే అని ఆరోపిస్తోంది. కాగా, గతనెల3న బాగ్దాద్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి బయల్దేరిన ఇరాన్ ఆర్మీ చీఫ్ ఖాసీం సులేమాని కాన్వారును లక్ష్యంగా అమెరికా డ్రోన్ దాడికి పాల్పడింది. ఈ దాడిలో సులేమాని సహా 10 మంది మృతిచెందారు.