భారత స్వాతంత్య్ర పోరాట స్ఫూర్తిని భావితరాలకు అందించాలని, విజయనగరం ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్రస్వామి పిలుపునిచ్చారు. స్వాతంత్య్ర పోరాట చరిత్రను విద్యార్థులకు అందించేందుకు తనవంతుగా కృషి చేస్తానని ఆయన అన్నారు. భారత ప్రభుత్వ ఫీల్డ్ అవుట్ రీచ్ బ్యూరో ఆధ్వర్యంలో, స్థానిక మహారాజా మహిళా కళాశాలలో అజాదీ కా అమృత్ మహోత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హాజరైన ఎంఎల్ఏ కోలగట్ల వీరభద్రస్వామి మాట్లాడుతూ, 75 ఏళ్ల అజాదీకా అమృత్ మహోత్సవాలను దేశం సగర్వంగా, సంతోషంగా జరుపుకుంటోందని అన్నారు.
స్వాతంత్య్రానికి పూర్వం మన దేశ ప్రజలు అనుభవించిన బాధలు, కష్టాలు వర్ణణాతీతమని పేర్కొన్నారు. నాటి తరం గొప్ప పోరాట పఠిమ కనపర్చి, దేశాన్ని బ్రిటీష్ వాళ్లనుంచి విముక్తం చేసిందన్నారు. వారి త్యాగాలను పునరావలోకనం చేసుకోవాల్సిన అవసరం ప్రస్తుత తరంపై ఉందన్నారు. సమరశీల పోరాట పఠిమను పుస్తక రూపంలో నేటి తరానికి అందించేందుకు తనవంతుగా ప్రయత్నం చేస్తానన్నారు. స్వాతంత్య్రానంతరం దేశప్రజల జీవన ప్రమాణాలను పెంచేందుకు కృషి జరుగుతోందన్నారు.
అభివృద్దికి విద్య ఎంతో కీలకమని, అందుకే తమ ప్రభుత్వం విద్య, వైద్యానికి అధిక ప్రాధాన్యతనివ్వడం జరుగుతోందని అన్నారు. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన అవుట్ రీచ్ బ్యూరో ఏడి ఎం.శ్రీనివాస్ మహేష్ మాట్లాడుతూ, అజాదీ కా అమృతోత్సవాల నిర్వహణ వెనుకనున్న భారత ప్రభుత్వ లక్ష్యాన్ని వివరించారు. స్వాతంత్య్రం సిద్దించి 75 ఏళ్లు కావస్తున్న నేపథ్యంలో, దేశంలో అజాదీకా అమృత్ ఉత్సవాలు గుజరాత్ లోని పోర్బందరులో మార్చి 12న ప్రారంభమయ్యాయని, 75 వారాల పాటు దేశవ్యాప్తంగా జరుగుతాయని తెలిపారు. కొంతమంది స్వాతంత్య్ర సమర యోధుల పోరాట స్ఫూర్తిని ఈ సందర్భంగా శ్రీనివాస్ గుర్తు చేశారు మాన్సాస్ విద్యాసంస్థల కరస్పాండెంట్ పివిఎల్ రాజు మాట్లాడుతూ, రానున్న తరంలో భారత స్వాంత్య్ర స్ఫూర్తిని రగిలించేందుకు ఇటువంటి ఉత్సవాలు దోహదపడతాయని అన్నారు.
జిల్లా సమాచార, పౌర సంబంధాల శాఖ సహాయ సంచాలకులు డి.రమేష్ మాట్లాడుతూ, స్వాతంత్య్ర సమరయోధుల త్యాగాల ఫలితంగానే, నేడు స్వాంత్య్ర ఫలాలను అనుభవించగలుగుతున్నామని అన్నారు. స్వాతంత్య్రం సిద్దించి 75 ఏళ్లు కావస్తున్న తరుణంలో నిర్వహిస్తున్న, అజాదీకా అమృత్ మహోత్సవాలు, మన దేశం ఆత్మావలోకనం చేసుకొనేందుకు దోహదపడతాయని పేర్కొన్నారు. ఈ ఉత్సవాల స్ఫూర్తితో, అన్ని రంగాల్లో మన దేశాన్ని అగ్రరాజ్యంగా నిలబెట్టడమే ప్రభుత్వ లక్ష్యమని అన్నారు
అనంతరం అజాదీ కా అమృత్ మహోత్సవ్ ర్యాలీని నిర్వహించారు. స్వాతంత్య్ర పోరాట యోధులను గురించి వివరిస్తూ. నిర్వహించిన సాంస్కృతిక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. వ్యాసరచన, వక్తృత్వ పోటీల విజేతలకు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో విజయనగరం మేయర్ వెంపడాపు విజయలక్ష్మి, డిప్యుటీ మేయర్ ఇసరపు రేవతీదేవి, ఎంఆర్ కళాశాల ప్రిన్సిపాల్ పి.జయలక్ష్మి, పలువురు అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.