37.2 C
Hyderabad
March 28, 2024 19: 50 PM
Slider ప్రపంచం

అమెరికా – చైనా ఎత్తులు పైఎత్తులు

#AmericanPresident

అగ్రరాజ్య స్థానాన్ని పదిలంగా నిలుపుకోవాలని అమెరికా,తానే అగ్రరాజ్యంగా అవతరించాలని చైనా ఒకరిపై ఒకరు కత్తులు నూరుకుంటున్నారు. ఎత్తుకు పైఎత్తులు వేసుకుంటున్నారు. నిన్నటి దాకా కొరకారని కొయ్యలా వున్న డోనాల్డ్ ట్రంప్ అధ్యక్ష స్థానం నుంచి దిగిపోవడంతో, చైనా ఊపిరి పీల్చుకుంది.

కొత్త అధ్యక్షుడు జోబైడెన్ తో అడుగులు వేయడానికి చైనా సరికొత్త ఆలోచనలకు పదునుపెడుతోంది. అమెరికాతో సంబంధాలను పునర్నిర్మించుకొని, తను అనుకున్న లక్ష్యాలను సాధించాలని చైనా ఉవ్విళ్లూరుతోంది.భారతదేశం, ఆగ్నేయాసియా,నాటో వంటి వ్యూహాత్మక,మిత్ర దేశాలతో పొత్తు పెట్టుకొని,చైనాకు చెక్ పెట్టాలని అమెరికా చూస్తోంది.

చైనాను అణచివేసిన డోనాల్డ్ ట్రంప్

డోనాల్డ్ ట్రంప్ ఆమెరికా అధ్యక్షుడుగా ఉన్నప్పుడు,చైనాను బద్ధ శత్రువుగా చూశాడు. వాణిజ్య పరంగా అనేక ఆంక్షలు విధించాడు.చైనా ఉత్పత్తులపై పన్నులు పెంచారు. చైనాకు చెందిన సాంకేతిక సంస్థలపై నిషేధం విధించారు.విద్యా సంబంధిత విషయాలపై కొత్త నిబంధనలను తీసుకొచ్చారు.

ట్రంప్ పరిపాలనా కాలంలో తెచ్చిన వాణిజ్య ఆంక్షలను ఎత్తివేయాలని,తమ ఉత్పత్తులపై పెంచిన పన్నులను తగ్గించాలని, సాంకేతిక సంస్థలపై పెట్టిన నిషేధాలకు ముగింపు పలకాలని,విద్యాపరమైన విషయాలపై విధించిన కఠిన నిబంధనలను సడలించాలని అమెరికాను చైనా కోరుతోంది.

అంతర్గత విషయాల్లో జోక్యం చేసుకోకూడదని హెచ్చరిస్తోంది. ఏర్పాటువాద శక్తులకు అమెరికా మద్దతు ఇస్తోందని చైనా అనుమానిస్తోంది. తైవాన్, హాంకాంగ్, టిబెట్, ఝిన్ ఝియాంగ్ వంటి ప్రాంతాల్లో తమ సార్వభౌమత్వానికి సంబంధించిన అంశంలో ఆమెరికా జోక్యం చేసుకుంటోందని చైనా ఆరోపిస్తోంది.

అమెరికా వాణిజ్య ఒప్పందాల కోసం చైనా తహతహ

ఇటువంటి జోక్యాలకు వెంటనే స్వస్తి పలకాలని కోరుకుంటోంది. అమెరికాతో వాణిజ్య సంబంధాలను తిరిగి నిర్మించుకోవాలని చైనా తహతహలాడుతోంది. రెండు రోజుల క్రితమే రెండు దేశాల విదేశాంగ శాఖల మధ్య సమావేశం జరిగింది.

జోబైడెన్ ఆధ్వర్యంలో కొత్తగా అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం తన విదేశాంగ విధానాలపై పునఃసమీక్ష చేసుకోవాలని చైనా హితవు పలుకుతోంది. ప్రపంచ గమనాన్ని దృష్టిలో పెట్టుకొని విధానపరమైన నిర్ణయాలు తీసుకోవాలని సూచిస్తోంది. ప్రపంచ పయనంలో చైనా ముందుకు దూసుకువెళ్తోందని, చాలా దేశాలు తమతోనే నడుస్తున్నాయని ధ్వని వచ్చేలా మాట్లాడుతోంది.

కాబట్టి,తనతో సత్ సంబంధాలు నిలుపుకోవడం మంచిదని,లేకపోతే నష్టం వాటిల్లుతుందని ఆమెరికాకు చైనా పరోక్షంగా సంకేతాలు అందిస్తోంది. అదే సమయంలో, రెండు దేశాల ఉమ్మడి అభివృద్ధి కోసం,శాంతియుత జీవనం కోసం కలిసి సాగడానికి తాము సిద్ధంగా ఉన్నామని బహిరంగంగా చైనా విదేశాంగ శాఖ ప్రకటించింది.

జోబైడెన్ మెతక వైఖరిపై చైనా ఆశలు

డోనాల్డ్ ట్రంప్ తో పోల్చుకుంటే జో బైడెన్ సాత్వికుడు, సహనశీలి కాబట్టి,అమెరికాతో బంధాలు మళ్ళీ ఏర్పడతాయనే విశ్వాసంలో చైనా అధినేతలు ఉన్నారు. తమను అపార్ధం చేసుకోవద్దు, అనుమానించవద్దు అంటూ  చైనా లౌక్య ప్రబోధం కూడా చేస్తోంది. చైనా విషయంలో తమ తీరు ఏ విధంగా ఉండబోతుందో కొత్త అధ్యక్షుడు బైడెన్ ఇంకా స్పష్టంగా చెప్పలేదు.

గతంలో ట్రంప్ వలె మరీ అంత కఠినంగా వ్యవహరించకపోయినా,తన దేశ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని,బైడెన్ ఆచితూచి అడుగులు వేస్తారని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. బంధాలను తిరిగి నెలకొల్పడంలో గతంలో కంటే ఎక్కువ జాగ్రత్తలు పాటిస్తారని పరిశీలకులు భావిస్తున్నారు.

అమెరికా – చైనా బంధాలపై అమెరికా సెనెట్ మెజారిటీ నాయకుడు చుక్ షమర్ తాజాగా కొన్ని ప్రతిపాదనలు చేశారు.వి విధ రంగాల్లో చైనా తమకు పోటీగా నిలుస్తోందని గుర్తించారు.

అమెరికా కింకర్తవ్యం?

వీటన్నింటినీ అధిగమించకపోతే అమెరికా మరింతగా నష్టపోతుందని హెచ్చరిస్తున్నారు. అమెరికాలో కొత్త ఉద్యోగాల సృష్టి జరగాలని ఆకాంక్షిస్తున్నారు. భారతదేశం వంటి మిత్ర దేశాల్లో పెట్టుబడులు పెట్టాలని ఆయన సూచిస్తున్నారు. కొత్త ఆవిష్కరణలు జరగడం, పరిశ్రమల్లో పెట్టుబడులు పెట్టడం,పోటీతత్త్వం పెంచుకోవడం ద్వారా చైనాను ఢీ కొట్టాలని చుక్ షమర్ ప్రభుత్వానికి చేసిన సూచనలు ఆలోచనలను రేకెత్తిస్తున్నాయి.

అమెరికా ఉపాధిపై చైనా పెద్ద దెబ్బకొట్టిందనే భావనతో ఆయన ఉన్నారు.చైనాకు పోటీగా అమెరికా వేయాల్సిన అడుగులపై,వచ్చే వసంతకాల సమావేశాల్లో తీర్మానాలు ప్రవేశ పెట్టే అవకాశం ఉందని సమాచారం.చిప్ తయారీలో చైనాను అధిగమించకపోతే, అమెరికా విపరీత పరిణామాలను ఎదుర్కొనే పరిస్థితులు కనిపిస్తున్నాయి.

సెమీ కండక్టర్ ఉత్పత్తి పరిశ్రమలో అమెరికా బలహీనంగా ఉందని అక్కడి నిపుణులు ఇప్పటికే ఒక అంచనాకు వచ్చారు. ఉత్పత్తి రంగంలో చైనా దూసుకుపోతోందనే స్పృహతోనూ ఉన్నారు.

చైనాను దెబ్బ కొట్టకపోతే…..

భారత్ సరిహద్దుల్లో బలగాలను ఉపసంహరించుకుంటూ, మళ్ళీ భారత్ కు దగ్గరయ్యే వ్యూహంలో చైనా ఉన్నట్లు అమెరికాలో  కొందరు ప్రజా ప్రతినిధులు భావిస్తున్నారు. చైనాను దెబ్బకొట్టకపోతే,తన అగ్రాసనాధిపత్యం నిలబడదనే భయంలో అమెరికా  ఉంది.

భారత్ వంటి దేశాలు అమెరికాకు బాగా దగ్గరయితే, తన సామ్రాజ్య విస్తరణకు గట్టి అవరోధాలు ఏర్పాడతాయని చైనా భయపడుతోంది. భావి పరిణామాలు,ఫలితాలు ఎట్లా ఉన్నా,ఉభయ దేశాలకూ భారత్ తో అవసరం ఉందన్నది నిర్వివాదాంశం.

ఈ రెండు దేశాల గమనాలను, పరిణామాలను చాలా సునిశితంగా గమనిస్తూ, ద్వైపాక్షిక బంధాలను బలోపేతం చేసుకోవడం, ఉభయ తారకంగా నిర్ణయాలను తీసుకోవడం భారత్ ముందున్న కీలక అంశాలు. మన విదేశాంగ విధానాలే మన రక్షణా కవచాలు. ఈ రెండు దేశాల మధ్య అడకత్తెరలో పోక చెక్క వలె కాక, అభివృద్ధిలో దూసుకువెళితేనే మనకు ప్రయోజనం

-మాశర్మ, సీనియర్ జర్నలిస్టు

Related posts

15న ప్రారంభం కానున్న సోలార్ షెడ్

Satyam NEWS

శ్రీశైల పుణ్య క్షేత్రంలో కూష్మాండదుర్గ అలంకారం

Satyam NEWS

దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె లో పాల్గొన్న కార్మిక సంఘాలు

Satyam NEWS

Leave a Comment