ఒకరిద్దరిని తప్ప మిగిలిన మంత్రులందరిని తీసేసేందుకే సీఎం జగన్ నిర్ణయించుకున్నట్లు కనిపిస్తున్నది. ఉప ముఖ్యమంత్రుల పేరుతో ఉన్నత పదవుల్లో ఉన్నవారికి కూడా పదవీ గండం తప్పేపరిస్థితి కనిపించడం లేదు. ఇంతకాలం ఊహాగానాలుగా ఉన్న ఈ విషయంపై ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి చేసిన వ్యాఖ్యలు బలం చేకూరుస్తున్నాయి.
అన్ని సామాజిక వర్గాలకు న్యాయం చేకూరేలా సీఎం జగన్ మంత్రివర్గాన్ని ఏర్పాటు చేయబోతున్నారని ఆయన అన్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీలకు పెద్దపీట వేసేలా క్యాబినెట్లో మార్పులు ఉంటాయని వెల్లడించారు. మంత్రివర్గంలో ఎక్కువ శాతం మార్పులు ఉండే అవకాశం ఉందన్నారు.
సామాజిక న్యాయానికి అనుగుణంగా సీఎం జగన్ కేబినెట్ ఏర్పాటు జరుగుతుందని ఆయన తెలిపారు. ఈ వ్యాఖ్యలతో ఒకరిద్దరికి మినహా ఎవరికి పదవి నిలబడే అవకాశం కనిపించడం లేదు. రాష్ట్రంలో ప్రభుత్వంపై ఎంతో వ్యతిరేకత కనిపిస్తున్నది.
ఈ వ్యతిరేకత అంతా వదిలించుకోవాలంటే మంత్రి వర్గం మొత్తాన్ని మార్చుకోక తప్పదని సీఎం జగన్ భావిస్తున్నారని అంటున్నారు. ఇప్పటి వరకూ ప్రభుత్వ పరంగా తీసుకుంటున్న నిర్ణయాలు అన్నీ సలహాదారుల సలహాలతోనే తీసుకుంటున్నారని ఎక్కువ శాతం మంది ప్రజలు అనుకుంటున్నారు. పాలనకు కొత్త అయిన జగన్ సలహాదారుల సలహాలు వినడం వల్లే తప్పు నిర్ణయాలు తీసుకుంటున్నారని చాలా మంది అనుకుంటున్నారు.
అంటే జగన్ ప్రభుత్వం తీసుకుంటున్న తప్పు నిర్ణయాలన్నీ సలహాదారుల ఖాతాలోకి వెళ్లిపోయి జగన్ పవిత్రుడిగా ఉండిపోతున్నారు. అదే విధంగా జిల్లాలో పార్టీపై ఉన్న వ్యతిరేకత అంతా కేవలం మంత్రుల కారణంగానే వస్తున్నదని జగన్ కు తెలిస్తే ఇలాంటివి జరగనివ్వరని కూడా పార్టీ కార్యకర్తల్లో బలంగా ఉంది.
జిల్లాల్లో జరుగుతున్న సంఘటనలు అన్నీ కూడా ప్రభుత్వానికి తీవ్ర వ్యతిరేకతను తెచ్చిపెడుతున్నాయి. ఇప్పుడు మంత్రులందరికి తీసేసి పక్కన పెడితే మళ్లీ కొత్త ప్రభుత్వం ఏర్పాటు అయినట్లు ఉంటుందని అనుకుంటున్నారు. ఇలా చేయడం ద్వారా ఇప్పటి వరకూ జ
రిగిన తప్పులన్నీ పాత మంత్రుల పైకి వెళ్లిపోతాయని, తమపై ఆ వ్యతిరేకత నిలిచి పోతుందని కూడా భావిస్తున్నారు. విపరీతంగా పెరిగిపోయిన ప్రభుత్వ వ్యతిరేకతను తగ్గించుకోవడానికి జగన్ ఉన్న మంత్రులందరిని వదిలించుకుంటారనే భావన నెలకొని ఉంది.
కొత్త మంత్రులు, కొత్త జిల్లాలు తదితర అంశాలతో ప్రజలలోకి మళ్లీ వెళ్లే అవకాశం వస్తుందని, ఇప్పటి వరకూ జరిగిన తప్పులు మాఫీ అయిపోతాయని కూడా జగన్ భావిస్తున్నట్లు కనిపిస్తున్నది. ఏది ఏమైనా మూడేళ్ల పాటు తిరుగులేని అధికారం చెలాయించిన ఈ హెవీ వెయిట్లు రాబోయే రోజుల్లో సాదా సీదాగా తిరగాల్సి ఉంటుంది. రాబోయే రోజుల్లో ఇది మరేఇతర పరిణామాలకు దారితీస్తుందో వేచి చూడాలి.