తిరుపతి పార్లమెంటు స్థానానికి జరిగే ఉప ఎన్నిక కోసం అధికార వై ఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ భారీ కసరత్తు చేస్తున్నది. ఇప్పటికే అభ్యర్ధిని ప్రకటించి ఎన్నికలకు రెడీ అవుతున్నది. సంతోషం. మరి స్థానిక సంస్థల ఎన్నికలకు అభ్యంతరం దేనికి?
అక్కడా ఓటర్లు వేటు వేయాల్సిందే, స్థానిక సంస్థల ఎన్నికలలో కూడా ఓటర్లు ఓటు వేయాల్సిందే కదా? ఈ ప్రశ్నలన్నీ మనకు మనం వేసుకోవడమే కానీ అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రం సమాధానం చెప్పదు. ఎందుకంటే స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ ఎన్నికల కమిషనర్ డాక్టర్ ఎన్.రమేష్ కుమార్ చేతులమీదుగా జరగడం ఇష్టం లేదు కాబట్టి.
కరోనా రెండో దశ ఎక్కడ ఉందో???
కరోనా మొదటి దశ వచ్చినప్పుడే బ్లీచింగ్ పౌడర్, పారాసిటమాల్ తో పోతుందని చెప్పిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కరోనా రెండో దశకు భయపడటమేమిటి? తెలియదు. స్థానిక సంస్థల ఎన్నికలు మాత్రం నిర్వహించడానికి వీల్లేదు అంతే. ఎన్నికల కమిషనర్ గా డాక్టర్ ఎన్.రమేష్ కుమార్ ఉన్నంత కాలం స్థానిక సంస్థల ఎన్నికలు జరిగేందుకు వీల్లేదు అంతే.
ఎన్నికల నిర్వహణపై అన్ని పార్టీల అభిప్రాయం తీసుకుని ఎన్నికల కమిషనర్ ముందుకు వెళుతుంటే ఆయనను వ్యక్తిగతంగా దూషించడం ఆంధ్రప్రదేశ్ మంత్రులకు పరిపాటిగా మారింది. మరీ ముఖ్యంగా రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ డాక్టర్ ఎన్.రమేష్ కుమార్ ను వ్యక్తిగతంగా తీవ్ర పదజాలంతో నిందిస్తున్నారు.
గవర్నర్ నే సవాల్ చేస్తున్నట్లుగా……
ఈ విషయంపై ఎన్నికల కమిషనర్ రాష్ట్ర గవర్నర్ కు ఫిర్యాదు కూడా చేశారు. విచిత్రం ఏమిటంటే ఆయన గవర్నర్ కు ఫిర్యాదు చేసిన రోజు సాయంత్రమే మళ్లీ మంత్రి కొడాలి నాని మరింత తీవ్ర పదజాలంతో డాక్టర్ ఎన్.రమేష్ కుమార్ ను తిట్టారు. ఇటు గవర్నర్ ను అటు రమేష్ కుమార్ ను కూడా సవాల్ చేశారు.
తనపై గవర్నర్ ఏం చర్యలు తీసుకుంటారో చూద్దాం అన్న తరహాలో ఫిర్యాదు చేసిన రోజునే మళ్లీ తిట్టడం ఇక్కడ గమనార్హం. రాజ్యాంగ పదవిలో ఉన్న వ్యక్తిని అత్యంత నీచమైన పదజాలంతో సంబోధించడం బహుశ ఆంధ్రప్రదేశ్ లోనే జరుగుతున్నది.
ఇప్పటి వరకూ జరిగిన స్థానిక సంస్థల ఎన్నికలలో రికార్డు స్థాయిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏకగ్రీవాలను సొంతం చేసుకున్నది. అప్పుడు ఎన్నికల కమిషనర్ గా ఉన్నది డాక్టర్ ఎన్.రమేష్ కుమారే. ఈ విషయాన్ని మరచిపోయిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇప్పుడు కేవలం తాము తీసేస్తే మళ్లీ వచ్చిన ఎన్నికల కమిషనర్ తమకు ఎదురు నిలవడం ఏమిటి అనే ధోరణితోనే ప్రవర్తిస్తున్నారు.
డాక్టర్ ఎన్ రమేష్ కుమార్ స్థానిక సంస్థ ల ఎన్నికల నిర్వహణకు ఏ ప్రయత్నం చేపట్టినా అడ్డుకుంటున్న అధికార పార్టీ రాబోయే రోజుల్లో ఏం చేస్తుందో అనే ఉత్కంఠ నెలకొని ఉంది. అదే విధంగా ఈ అంశం మొత్తాన్ని డాక్టర్ ఎన్ రమేష్ కుమార్ ఇప్పటికే రాష్ట్ర కోర్టు దృష్టికి తీసుకువెళ్లారు. స్థానిక సంస్థల ఎన్నికలను తీవ్రాతి తీవ్రంగా అడ్డుకుంటున్న ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి తిరుపతి ఎన్నికలకు పార్టీని సమాయత్తం చేసుకుంటున్నారు.