భారత ప్రధాని నరేంద్ర మోదీ గత ఆదివారం ప్రసంగించిన 68 వ ‘మన్ కీ బాత్’ కార్యక్రమానికి వీక్షకుల నుంచి పెద్ద ఎత్తున నిరసన వ్యక్తమైంది. మునుపెన్నడూ లేనివిధంగా లక్షల సంఖ్యలో ‘అయిష్టతలు’ నమోదుకావడం ఆశ్చర్యం కలిగిస్తోంది.
బీజేపీ యూట్యూబ్ ఛానెల్లో ఈ ప్రసంగం చూసిన సుమారు 20 లక్షలమందిలో 5.32 లక్షల వీక్షకులు ‘అయిష్టత’ ప్రకటించారు. పీఎంఓ వీడియో ఛానెల్ చూసినవారిలో 85వేల మంది ‘అయిష్టత’ ప్రకటించడం గమనార్హం.
ఇంత వ్యతిరేకత ఎన్నడూ లేదు
సెప్టెంబర్ నెలలో నిర్వహించాలని ప్రభుత్వం తలపెట్టిన నీట్, జేఈఈ పరీక్షల గురించి ప్రధాని మాట్లాడతారని ఎదురుచూసిన విద్యార్థులు తీవ్రనిరాశకు లోనయ్యారు. దానిఫలితమే ఇంత భారీ సంఖ్యలో నిరసన వ్యక్తం కావడమని పరిశీలకుల వ్యాఖ్యానం.
ఒకవైపు రోజురోజుకీ పెరుగుతున్న కోవిడ్ కేసులు…మరోవైపు బీహార్, అస్సాం రాష్రాలలోని వరద భీభత్సంతో ప్రజలు భయకంపితులవుతున్న సమయంలో పరీక్షల నిర్వహణ కష్టమే అని విద్యారంగనిపుణులు సైతం ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నారు.
విద్యాసంవత్సరం వృథా కాకుండా కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా ఉన్నతవిద్యకు సంబంధించిన ప్రవేశపరీక్షలు నిర్వహించేందుకు ప్రభుత్వం సమాయత్తమవుతున్న నేపథ్యంలో పెద్దఎత్తున అయిష్టత రూపంలో వ్యతిరేకత రావడం చర్చకు దారితీస్తోంది.
అశయం మంచిదే అయినా…
జెఈఈ మెయిన్ పరీక్ష ను సెప్టెంబర్ 1-6 వరకు , సెప్టెంబర్ 13న నీట్ పరీక్ష నిర్వహించాలని ప్రభుత్వం పట్టుదలగా ఉంది. కోవిడ్ మహమ్మారి ఉద్ధృతిని దృష్టిలో ఉంచుకుని అన్నిరకాల ప్రవేశపరీక్షల నిర్వహణ వాయిదా వేయలని కాంగ్రెస్ తో పాటు కొన్ని ప్రతిపక్షాలు కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడిచేస్తున్నాయి.
దేశయువత భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ఉన్నతవిద్యకు చెందిన ప్రవేశపరీక్షలు నిర్వహించాలనే ప్రభుత్వ ఆశయం మంచిదే అయినా నెలకొన్న విషమపరిస్థితుల కారణంగా కొద్దికాలం వాయిదా వేయాలని విద్యా వేత్తలు, పౌరసంఘాలు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాయి.
కోవిడ్ నిబంధనలు కఠినతరంగా అమలుచేసి ఇతర దేశాలలో తగతులు నిర్వహిస్తున్న విద్యాకేంద్రాలలో తిరిగి వైరస్ విజృంభిస్తోన్న దాఖలాలు రాగల ప్రమాదాన్ని సూచిస్తున్నాయి.
ప్రపంచ వ్యాప్తంగా మృత్యుఘంటికలు మోగుతున్న వేళ పట్టుదలకు పోయి యువత జీవితాలతో ఆదుకోవడం శ్రేయస్కరం కాదని పరీక్షల నిర్వహణాధికారులు సైతం భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కేంద్రప్రభుత్వం తీసుకునే సానుకూల నిర్ణయం కోసం దేశం నిరీక్షిస్తోంది.
-పొలమరశెట్టి కృష్ణారావు