దివంగత వై ఎస్ రాజశేఖర్ రెడ్డి కుమార్తె షర్మిలాఅనిల్ ప్రకటన తో తెలంగాణా రాష్ట్రంలో లో రాజకీయవేడి పుంజుకుంది. తెలంగాణలో రాజన్న రాజ్యం తేవాలన్నది తన అంతిమ లక్ష్యంగా ఆమె తెలిపారు.
విలేకరులతో మాట్లాడుతూ తెలంగాణా ప్రభుత్వంలో రైతులు, విద్యార్థులు సంతోషంగా ఉన్నారా? ప్రజలకు ఆరోగ్యశ్రీ అందుతోందా? ఎంతమందికి ఇళ్ళు ఇచ్చారు? అంటూ పలు ప్రశ్నలు సంధించారు.
నల్గొండ జిల్లానుంచి తరలివచ్చిన వై ఎస్ ఆర్ అభిమానులతో జరిగినఆత్మీయ సమ్మేళనంలో పలు విషయాలపై చర్చజరిగినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంచితే… తెలంగాణా లో మరో రాజకీయపార్టీ అవతరించదగిన రాజకీయ శూన్యత ప్రస్తుతం ఉన్నదా? అనే చర్చ రాజకీయ పరిశీలకులలో మొదలైంది.
ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నట్లు తెలంగాణాలో తెరాస మినహా మిగిలిన ప్రాంతీయపార్టీలు పుట్టిన అనతికాలంలోనే అదృశ్యమైన ఉదంతం మరోసారి పునరావృతం కానున్నదా తేలాల్సిఉంది. తెలంగాణా లో ఇప్పటికే అధికార తెరాసతో పాటు బీజేపీ, కాంగ్రెస్, ఎమ్ ఐ ఎమ్,వామపక్షాలు తదితరులు ప్రజాక్షేత్రంలో ఉన్నాయి.
ఈ నేపథ్యంలో రాజన్నరాజ్యం నినాదంతో కొత్తగా ఒక రాజకీయపార్టీ ఆవిర్భావం ఎంతవరకు తెలంగాణా ప్రజల ఆదరణ పొందగలదనేది ఇప్పుడే ఊహించడం కష్టం. తెలంగాణా కాంగ్రెస్ లో ఉన్న అసంతృప్తివాదులను, తెరసలో ఉన్న ఒకనాటి వై ఎస్ ఆర్ అభిమానులను ఆకర్షించేందుకు షర్మిలా అనిల్ పావులు కదుపుతున్నారా ? అనేది తెలియాల్సి ఉంది.
అశేష జనావళి అభీష్టం మేరకు తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది అప్పటి కాంగ్రెస్ నాయకత్వమే నని తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఇప్పటికీ వాదిస్తుంటారు. అప్పట్లో సమైక్య ఆంధ్రప్రదేశ్ కు ముఖ్యమంత్రిగా ఉన్న వై ఎస్ ఆర్ రాష్ట్ర విభజనను తీవ్రంగా వ్యతిరేకించిన సందర్భాలు అనేకం ఉన్నాయి.
ఆయన హఠాత్మరణానంతరం చోటుచేసుకున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో రాష్ట్రం రెండుగా విడిపోయి తెలంగాణ ఆవిర్భావం జరిగింది. వై ఎస్ ఆర్ మరణంతో కాంగ్రెస్ సమర్ధవంతమైన నాయకత్వాన్ని కోల్పోయింది.
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు వ్యతిరేకిగా ముద్రపడిన వై ఎస్ ఆర్ కుమార్తె పార్టీని తెలంగాణా ప్రజలు ఆదరిస్తారా? అనేది పెద్దప్రశ్న. వై ఎస్ ఆర్ తెలంగాణపార్టీ పేరుతో షర్మిలా అనిల్ ప్రత్యక్ష రాజకీయరంగ ప్రవేశం చేయనున్నట్లు తెలుస్తోంది.
త్వరలో తెలంగాణ జిల్లాలలో పర్యటించి, క్షేత్రస్థాయి సమస్యలపై స్పందించనున్నట్లు సమాచారం. నిధులు, నియామకాలు, నీళ్ళు వంటి కీలక అంశాలపై పొరుగురాష్ట్రం ఆంధ్రప్రదేశ్ తో ఇప్పటికీ అపరిష్కృతంగా ఉన్నవాటిపై షర్మిల వైఖరి ఎలా ఉంటుందో వేచిచూడాలి.
ఇప్పటివరకు తెలంగాణా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలమధ్య పరస్పర సహకారం నెలకొనిఉంది. తాజాపరిణామాల నేపథ్యంలో రానున్నరోజుల్లో వై ఎస్ ఆర్ సీ పీ ఆలోచనాధోరణిలో ఎలాంటి మార్పులు చోటుచేసుకుంటాయన్నది స్పష్టం కావలసిఉంది. ‘ రాజకీయాలలో శాశ్వత మిత్రత్వం, శాశ్వతశత్రుత్వం ఉండవు’ అన్న విజ్ఞులమాట సందర్భోచితం.
పొలమరశెట్టి కృష్ణారావు