రాజ్యాంగేతర శక్తులతో రాజ్యాంగాన్ని నడపాలనుకోవడం, పరిపాలనలో కాలయాపన చేయడం ప్రజాస్వామ్య వ్యవస్థకే గొడ్డలిపెట్టు అని వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డి అన్నారు. నెల్లూరు జిల్లా ఆత్మకూరులో ఆయన మీడియాతో మాట్లాడారు. ఇటీవలె ఆయన అధికార వైసీపీకి దూరం జరిగిన విషయం తెలిసిందే. మార్చి 15 బడ్జెట్ సమావేశాల తరువాత మధ్యంతర ఎన్నికలు వస్తాయా.. సాధారణ ఎన్నికల అనేది చూడాలి అని ఆయన వ్యాఖ్యానించారు. భవిష్యత్ రాజకీయ నిర్ణయానికి ఇంకా సమయం ఉంది. ప్రస్తుతం నేను ఉన్న పార్టీ అయినా నన్ను తొలిగించాలి.. లేదా నేను అయినా వదులుకోవాలి.. ఈ రెండు జరగని దానికి ఇప్పుడే నిర్ణయం తీసుకోవడం సరైన విధానం కాదు అని ఆయన అన్నారు.
1993 జనవరి 9న ఎన్టీరామారావు సారధ్యంలో ప్రత్యక్ష రాజకీయ రంగ ప్రవేశం చేశా.. కొన్ని అనివార్య కారణాల వల్ల ఆ పార్టీకి దూరమయ్యాం.. అని అన్నారు. ప్రస్తుతం క్షణికావేశాలతో నిర్ణయం తీసుకోను. త్వరలో భవిష్యత్ రాజకీయ నిర్ణయం ప్రకటిస్తానని తెలిపారు. రానున్న బడ్జెట్ సమావేశాల అనంతరం సరైన రాజకీయ నిర్ణయంతో ముందుకు సాగుతామని తెలిపారు.
ప్రజలతో ఎన్నుకోబడిన ఎమ్మెల్యే హక్కులను ఎవరూ హరించలేరని తెలిపారు. ఆత్మకూరులో తానెప్పుడూ రాజ్యాంగేతర శక్తిగా పనిచేయలేదన్నారు. పదేళ్లకు ముందు తాను వదిలిపోయిన అభివృద్ధి పనులు ఎలా ఉన్నాయో ఆత్మకూరులో ఇప్పుడూ అలానే ఉన్నాయన్నారు. దశాబ్దాల కాలంగా ప్రజల ఆశీస్సులతోనే రాజకీయాల్లో కొనసాగుతూ తాము ప్రాతినిధ్యం వహించే నియోజకవర్గాల అభివృద్ధికి కృషి చేస్తున్నట్లు ఆయన చెప్పారు.
ఏది జరిగినా మన మంచికేనని.. ఒకటి కోల్పోతే అంతకన్నా విలువైనదే పొందవచ్చన్నది తనకు అనుభవం అన్నారు. తాను ఎక్కడ ఉన్నా తన అభిమానులు, ప్రజలు వెన్నంటే ఉంటారని, ఆత్మకూరులో కూడా అభిమానులు వెంటే ఉన్నారని రామనారాయణరెడ్డి తెలిపారు.