రైలు కిందపడి చనిపోవాలనుకున్న ముగ్గుర్ని అనంతపురం త్రీటౌన్ పోలీసులు కాపాడారు. ఇద్దరు పిల్లలు సహా తండ్రిని సురక్షితంగా కుటుంబ సభ్యులకు అప్పగించారు. అనంతపురము 5 వ రోడ్డుకి చెందిన గురజాల హరికృష్ణ కుటుంబ సభ్యులతో గొడవపడి తన ఇద్దరు పిల్లలైన ప్రవీణ్, ప్రేమ్ కుమార్ లను ఈరోజు ఇంటి నుండీ తన వెంట తీసికెళ్లాడు.
స్థానిక నేషనల్ పార్క్ దగ్గర ఉన్న రైల్వే ట్రాక్ వద్దకు వెళ్లి ఇద్దరు పిల్లలు సహా తాను రైలు కిందపడి చనిపోతున్నామంటూ ఒక సెల్ఫీ ఫోటో ను వాళ్ళ బంధువులకి సెల్ ఫోన్ ద్వారా పంపాడు.
ఈ సమాచారాన్ని డయల్ 100 కు చేరవేశారు. స్థానిక త్రీటౌన్ సి.ఐ కత్తి శ్రీనివాసులు అప్రమత్తమై రెండు పోలీసు బృందాలను ఆ ప్రాంతానికి పంపారు. హెడ్ కానిస్టేబుల్ శివయ్య మరియు కానిస్టేబుళ్లు ఆనంద్ రంజిత్ , నరేష్ కలసి ఆ ముగ్గుర్ని కాపాడారు. కౌన్సెలింగ్ అనంతరం కుటుంబ సభ్యులకు వారిని అప్పగించారు. త్రీటౌన్ సి.ఐ కత్తి శ్రీనివాసుల ఆధ్వర్యంలో పోలీసులను జిల్లా ఎస్పీ కె.శ్రీనివాసరావు అభినందించారు.