తన మూడేళ్ల పాలనలో జగన్ 8 లక్షల కోట్ల అప్పులు చేశారని ఒక్కొ ఇంటిపై 7 లక్షల కోట్ల అప్పు ఉందని మదనపల్లె మహానాడు సభలో టిడిపి జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు అన్నారు. అయితే అప్పులు తెచ్చిన ఈ సొమ్ము అంతా ఎటుపోయింది….ఒక్క రోడ్డు వేశారా…ఒక్క గుంత పూడ్చారా అని ఆయన ప్రశ్నించారు.
వైసిపి దోపిడీని ప్రశ్నిస్తే తమపై దాడులు చేస్తున్నారని….కేసులు పెడతున్నారని ఆయన అన్నారు. ఒక్క చాన్స్ ఇవ్వమని జగన్ పాదయాత్ర చేశారని, అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రాన్ని నాశనం చేశారని చంద్రబాబునాయుడు తెలిపారు. అమ్మఒడి పేరుతో జగన్ మోసం చేశారని ఆయన తెలిపారు.
300 యూనిట్ల కరెంట్ వాడితే అమ్మఒడి రావడంలేదని, అమ్మఒడి ఒక బూటకంగా మారిందని ఆయన అన్నారు. ‘‘ నేను తిరుపతిలోనే ఎంఎ ఎకనమిక్స్ చదివాను…జగన్ ఎక్కడ చదివారో వైసిపి నేతలు చెపుతారా?’’ అని చంద్రబాబునాయుడు ప్రశ్నించారు.
రాష్ట్రంలో 8 వేల గ్రామాల్లో స్కూళ్లు మూసేశారు. తాను చదువుకోడు చదువుకునే వాడ్ని చదువుకోనివ్వడు అని ఆయన విమర్శించారు. బాదుడే బాదుడుతో జగన్ నడ్డి విరుస్తున్నాడని చంద్రబాబు అన్నారు. చేతి వృత్తుల వారిపై 5 వేల కోట్లు పన్నులు వేసేందుకు సిఎం సిద్దం అయ్యారని చంద్రబాబు తెలిపారు.
జగన్ కుమార్తెలు ప్యారిస్ లో, లండన్ లో చదవాలి…మన పిల్లలు వాగులు వంకలు దాటి వెళ్లాలా అని ఆయన ప్రశ్నించారు. జగన్ పెట్టిన ప్రతి కేసుపై చిత్ర గుప్తుడిలా లెక్కలు రాస్తున్నా…అధికారం లోకి వచ్చిన తరువాత అన్నింటికీ తిరిగి చెల్లిస్తా అని ఆయన అన్నారు.