పవిత్రమైన అయ్యప్ప మాలను అవమానించిన మాజీ మంత్రి, వైసీపీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ పై చర్యలు తీసుకోవాలని బిజెపి రాష్ట్ర ప్రధానకార్యదర్శి యస్.విష్ణువర్ధన్ రెడ్డి డిమాండ్ చేశారు. హిందువులు అతి పవిత్రంగా భావించే అయ్యప్ప దీక్ష లో మండలం రోజుల పాటు అత్యంత నిష్టతో ఉంటారు. నల్లని దుస్తులు వేసి కాళ్లకు చెప్పులు కూడా లేకుండా అయ్యప్ప భక్తులు దీక్ష కొనసాగిస్తారు. రాగద్వేషాలకు అతీతంగా సర్వ సుఖాలకు దూరంగా భక్తులు అత్యంత నిష్టతో అయ్యప్పమాల వేసుకుని నియమాలు ఆచరిస్తారు.
అలాంటిది అనీల్ కుమార్ యాదవ్ అయ్యప్ప దీక్షలో ఉంటూ ముస్లింల టోపీని పెట్టుకుని, భుజంపై తెల్లని వస్త్రం కప్పుకుని గడప గడపకు కార్యక్రమంలో పాల్గొన్నారని ఆయన తెలిపారు. హిందువుల ఆరాధ్య, పవిత్రమైన అయ్యప్ప మాలదీక్షను ఆయన తీవ్రంగా అవమానించారని విష్ణువర్ధన్ రెడ్డి విమర్శించారు. అయ్యప్ప భక్తులకు మాజీ మంత్రి, ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ తక్షణమే క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. ఓటు బ్యాంకు రాజకీయాల కోసం వైసిపి నేత బరితెగించడం సిగ్గుచేటని ఆయన అన్నారు. ఇలాంటి వ్యవహారాలను హిందూ సమాజం క్షమించదని ఆయన అన్నారు.