ఎక్కడ శాంతిభద్రతలు పక్కాగా ఉంటాయో అక్కడ అభివృద్ధి సాధ్యమని అనంతపురం రేంజ్ డి.ఐ.జి ఎం.రవిప్రకాష్ అభిప్రాయపడ్డారు. వార్షిక తనిఖీల్లో భాగంగా జిల్లా సాయుధ దళాల పరేడ్ ను జిల్లా ఎస్పీ డాక్టర్ ఫక్కీరప్ప కాగినెల్లి తో కలసి ఆయన తనిఖీ చేశారు. పరేడ్ తో పాటు పోలీసు జాగిలాల ప్రదర్శన, మాబ్ ఆపరేషన్ , వి.ఐ.పి లకు భద్రతలు కల్పించడంపై నిర్వహించిన డెమోలను సమీక్షించారు. ముందుగా ఏ.ఆర్ సాయుధ బలగాల నుండీ డి.ఐ.జి, ఎస్పీలు గౌరవ వందనం స్వీకరించారు. పరేడ్ పరిశీలన వాహనంపై వెళ్లి క్షుణ్ణంగా చెక్ చేశారు. అనంతరం సిబ్బందిని ఉద్ధేశించి డి.ఐ.జి మాట్లాడారు.
పరేడ్ చక్కగా చేశారు. అభినందిస్తూ అందరికీ రివార్డు ప్రకటించారు. పోలీసులు ఎప్పుడూ విధుల్లో కచ్చితత్వం ఉండాలి. యూనిఫాంలో ఉన్నప్పుడు ప్రజలు మనల్ని గమనిస్తుంటారు. క్రమశిక్షణ, అంకితభావంతో పని చేస్తున్నారు. ఆందోళనలు, ధర్నాలు, బందోబస్తుల సందర్భంగా సమర్థవంతమైన విధులు నిర్వర్తించడం ముదావహం. ఇదే స్ఫూర్తిని మున్ముందు కొనసాగించాలి. రాబోవు ఎన్నికల దృష్ట్యా అందరూ సమిష్టిగా, సమర్థవంతంగా విధులు నిర్వర్తించాలి. గతంలో మావోయిజం, ఫ్యాక్షనిజం జిల్లాలో ఉండేవి. నిద్రలేని రాత్రులు ఎన్నో గడిపారు. ప్రస్తుతం జిల్లా ప్రశాంతంగా ఉందంటే గతంలో మన పోలీసులు చేసిన కృషి ఫలితమే. ప్రజలు సుఖంగా నిద్రించాలంటే మనం నిద్ర మేల్కోవాలి. ట్రాఫిక్ క్రమబద్ధీకరణ నుండీ శాంతి భద్రతల పరిరక్షణ, నేరస్తులపై చర్యలు, శిక్షలు వరకు మనం ఎంతో కష్టిస్తున్నాం. జిల్లాకు మంచి పేరు తీసుకురావాలి. రాద్ధాంతాలు, తప్పులు చేయడానికి వెళ్లొద్దు. విధులతో పాటు కుటుంబాలను అభివృద్ధి చేసుకోవాలి. పిల్లలను బాగా చదివించండి. చదువే కీలకం. విద్యయే ఆయుధం. గతంలో కంటే మెరుగ్గా పోలీసు పిల్లలను చదివిస్తుండటం అభినందనీయం. పిల్లలను ఉన్నత హోదాల్లోకి వెళ్లడమే మన ఉద్ధేశ్యం. డి.ఐ.జి, ఎస్పీ తో పాటు అదనపు ఎస్పీలు ఇ.నాగేంద్రుడు, హనుమంతు, ఏ.ఆర్ డీఎస్పీ శ్రీనివాసులు, ఆర్ ఐ హరికృష్ణ, ఎస్సై నభీరసూల్ , ఆర్ ఎస్ ఐలు తదితరులు పాల్గొన్నారు.