ఇదేం మాయరోగమో కానీ పరువు తీసే విధంగా గుండు కొట్టించడం అలవాటైపోయింది. ఆంధ్రప్రదేశ్లోని విశాఖలో జరిగిన శిరోముండనం ఘటన మరవకముందే మరో ఘటన చోటుచేసుకుంది. పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెంలో తీసుకున్న అప్పు తీర్చలేదంటూ ఓ యువకుడిని కారులో బలవంతగా తీసుకెళ్లి శిరోముండనం చేసిన ఘటన ఆదివారం చోటు చేసుకుంది.
జంగారెడ్డిగూడెం ఎస్సై కుటుంబరావు తెలిపిన వివరాల ప్రకారం తాడేపల్లిగూడేనికి చెందిన అలక అభిలాష్(23) జంగారెడ్డిగూడేనికి చెందిన యర్రసాని విజయ్బాబు వద్ద మూడు నెలల క్రితం రూ.30 వేలు అప్పుగా తీసుకున్నాడు.
ఈ బాకీని తీర్చాలంటూ విజయ్బాబు గత మూడు రోజులుగా అభిలాష్ని అడుగుతున్నాడు. 3వ తేదీన రాత్రి విజయ్బాబు, తన మిత్రులు షేక్ నాగూల్ మీరావళి, కంకిరెడ్డి మార్కేండేయులతో కలిసి తాడేపల్లిగూడెంలోని అభిలాష్ ఇంటికి వెళ్లారు.
అక్కడ నుంచి అభిలాష్ను కారులో ఎక్కించుకుని నేరగా జంగారెడ్డిగూడెం బాట గంగానమ్మ లేఅవుట్ కాలనీకి తీసుకువచ్చి ఓ ఇంట్లో ఉంచారు. తీసుకున్న అప్పు తీర్చలేకపోవడంతో మరో వ్యక్తితో అభిలాష్కు శిరోముండనం చేయించారు.
అనంతరం బాధితుడిని స్థానిక ఆర్టీసీ బస్టాండు వద్ద వదిలిపెట్టి వెళ్లిపోయారు. అనంతరం అభిలాష్ పోలీసులను ఆశ్రయించడంతో వారు కేసు నమోదు చేశారు.