విజయనగరం జిల్లా విజయాలకు ఖిల్లాగా మారింది. తాజాగా జిల్లాకు మరో స్కోచ్ అవార్డు వరించింది. హరిత విజయనగరం సాధనే లక్ష్యంగా జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎం.హరి జవహర్లాల్ చేసిన కృషిని గుర్తిస్తూ, స్కోచ్ కమిటీ విజయనగరం జిల్లాకు రజత పురస్కారాన్నిప్రకటించింది.
దీంతో జాతీయస్థాయిలో జిల్లా ఖ్యాతి మరోసారి మారుమ్రోగింది. జిల్లా కలెక్టర్ డాక్టర్ హరి జవహర్లాల్ అత్యంత ప్రాధాన్యతాంశాలు కలిగిన మూడింటిలోనూ అవార్డులను దక్కించుకోవడం ద్వారా జిల్లా చరిత్రలో కొత్త అధ్యాయాన్ని లిఖించారు.
డొనేట్ రెడ్, సేవ్ బ్లూ, స్ప్రెడ్ గ్రీన్ నినాదాలు ఇప్పటికే విస్తృత ప్రాచుర్యం పొందాయి. డొనేట్ రెడ్ పేరుతో జిల్లాలో రక్తదానానికి బహుళ ప్రాచుర్యం కల్పించారు.
అలాగే ప్రకృతిని సంరక్షించాలని, భావితరాలకోసం నీటి వనరులను కాపాడుకోవాలని కలెక్టర్ ప్రజలకు పిలుపునివ్వడమే కాకుండా, స్వయంగా తానే చెరువులను శుద్ది చేయడానికి నడుంబిగించారు. ఇక అనునిత్యం మొక్కలను నాటడం జిల్లా కలెక్ట్ర్కు దినచర్యగా మారింది.
ఈ ఏడాది ఇప్పటికే జిల్లాలో సుమారు కోటి, 36లక్షలకు పైగా మొక్కలను నాటారు. జగనన్న పచ్చతోరణం కార్యక్రమాన్ని ప్రభుత్వం ప్రారంభించకముందు నుంచే జిల్లా కలెక్టర్ హరిత యజ్ఞానికి శ్రీకారం చుట్టారు. ఫలితంగా జిల్లాకు తాజాగా స్కోచ్ అవార్డు లభించింది. అదేవిధంగా స్వచ్ఛభారత్లో బొబ్బిలి మున్సిపాల్టీకి స్కోచ్ రజిత పురస్కారం లభించింది.
ప్రజలకే అంకితం-కలెక్టర్ డాక్టర్ ఎం.హరి జవహర్లాల్
హరిత యజ్ఞంలో భాగస్వాములైన ప్రతీఒక్కరికీ ఈ స్కోచ్ పురస్కారాన్ని అంకితం చేస్తున్నాను. హరిత విజయనగరం సాధన కోసం నాతో కలిసి నిత్యం అడుగులు వేసిన ప్రతీఒక్కరికీ అభినందనలు. మనందరి సమిష్టి కృషి వల్లే, ఈ మనకు ఈ అరుదైన గుర్తింపు లభించింది.
ఈ అవార్డులను స్ఫూర్తిగా తీసుకొని ప్రకృతి వనరుల సంరక్షణకు, మొక్కలను నాటడానికి మనమంతా పునరంకితం కావాలని ఆకాంక్షిస్తున్నా. రజత పురస్కారాన్ని గెలుచుకున్న బొబ్బిలి మున్సిపాల్టీకి ప్రత్యేక అభినందనలంటూ తెలియజేసారు.