ఏపీ ప్రభుత్వానికి హైకోర్టులో మరోసారి ఎదురుదెబ్బ తగిలింది. రాజధానిలో ఆర్5 జోన్ ప్రకటిస్తూ ఇచ్చిన గ్రెజిట్ నోటిఫికేషన్ 355ను నాలుగు వారాల పాటు సస్పెండ్ చేస్తూ హైకోర్టు నిర్ణయం ప్రకటించింది.
రాజధాని మాస్టర్ ఫ్లాన్లో మార్పులకు ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రక్రియను సీఆర్డీఏలోని సెక్షన్ 41 ప్రకారం మాస్టర్ ప్లాన్ని మార్పు చేయాలంటే.. స్థానిక సంస్థలు, గ్రామ కమిటీల నుంచి అభిప్రాయాలు సేకరించాలని రాజధాని రైతుల తరపున వాదనలు వినిపించారు.
వీరి వాదనలతో పాటు ప్రభుత్వ వాదనను కూడా హైకోర్టు విన్నది. ఇరువాదనలు విన్న ధర్మాసనం ప్రభుత్వ ఉత్తర్వులను సస్పెండ్ చేసింది. వేసవి సెలవుల తర్వాత జూన్ 17కు విచారణను వాయిదా వేశారు. అమరావతి ప్రాంతంలో ఆర్5 జోన్ కింద రాజధానిలోని 29 గ్రామాల వారికి కాకుండా.. గుంటూరు, విజయవాడ నగరాలతో పాటు పెదకాకాని, తాడేపల్లి, మంగళగిరి, దుగ్గిరాల ఈ మండలాలకు చెందిన వారికి స్థలాలు ఇచ్చేందుకు 1300 ఎకరాలను కేటాయిస్తూ ప్రభుత్వం జీవో జారీ చేసిన విషయం తెలిసిందే.
ఇందుకోసం ఆర్5ను సృష్టించారు. సీఆర్డీయే చట్టాన్ని అందులోని మాస్టర్ ప్లాన్ను మార్పులు చేస్తూ ఈ ప్రతిపాదనలను రాష్ట్ర ప్రభుత్వం చేసింది. ఈ ప్రతిపాదనలు చట్టపరమైన ప్రక్రియను, నింబంధనను పాటించకుండా చేస్తున్నారని, సీఆర్డీయే చట్టానికి, మౌలిక సూత్రాలకు వ్యతిరేకంగా ఈ ప్రక్రియ జరుగుతోందని రాజధాని రైతులు హైకోర్ట్ ను ఆశ్రయించారు.