రాష్ట్ర ఎన్నికల కమిషనర్ డాక్టర్ ఎన్.రమేష్ కుమార్ విషయంలో వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషన్ హరిచందన్ చెప్పినా వినకుండా ఇప్పటి వరకూ ఆయనను విధులు చేపట్టకుండా నిరోధించడంపై సుప్రీంకోర్టు మండిపడింది.
రాష్ట్ర హైకోర్టులో నిమ్మగడ్డ రమేష్ కుమార్ దాఖలు చేసిన కోర్టు ధిక్కరణ కేసుపై విచారణ చేపట్టకుండా అడ్డుకోవడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ అంశంపై నేడు సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయ మూర్తి జస్టిస్ ఎస్ ఏ బాబ్రే నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం ఈ విచారణ చేపట్టింది.
నిమ్మగడ్డ రమేష్ కుమార్ తరపున సీనియర్ న్యాయవాది హరీష్ సాల్వే తన వాదనలు వినిపించారు. రాష్ట్ర హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను ప్రభుత్వం అమలు చేయడం లేదని హరీష్ సాల్వే కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. ఈ కేసు విషయంలో ప్రతి అంశాన్ని తాము నిశితంగా గమనిస్తూనే ఉన్నామని అందుకోసమే తాము రాష్ట్ర ప్రభుత్వం కోరినట్లు స్టే ఇవ్వడం లేదని ధర్మాసనం వెల్లడించింది.
గవర్నర్ లేఖ పంపినా రమేష్ కుమార్ కు పోస్టింగ్ ఇవ్వకపోవడం అత్యంత దారుణమైన విషయమని ధర్మాసనం వ్యాఖ్యానించింది. వచ్చే శుక్రవారం లోపు రమేష్ కుమార్ బాధ్యతలు చేపట్టేందుకు ఏర్పాట్లు చేయాలని కూడా సుప్రీంకోర్టు ఆదేశించింది.