వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వానికి అతి పెద్ద ఎదురు దెబ్బ తగిలింది. రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్గా డాక్టర్ ఎన్.రమేష్ కుమార్ ను తొలగించే ఉద్దేశ్యంతో ఆయన పదవికాలాన్ని కుదిస్తూ తీసుకువచ్చిన ఆర్డినెన్సును హైకోర్టు కొట్టేసింది.
స్థానిక ఎన్నికల ప్రక్రియ వాయిదా పడిన అనంతరం ఎన్నికల కమిసనర్ నియామకం, పదవీకాలం విషయమై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జారీ చేసిన ఆర్డినెన్స్ను హైకోర్టు కొట్టేసింది. పంచాయతీరాజ్ చట్టానికి సవరణ చేస్తూ ఆర్డినెన్స్, జీవోలపై హైకోర్టులో వ్యాజ్యాలు దాఖలయ్యాయి. తనను తొలగించాలన్న దురుద్దేశంతోనే ఆర్డినెన్స్ తీసుకొచ్చారని రమేశ్ కుమార్ పిటిషన్ దాఖలు చేశారు.
ఆర్డినెన్స్, తదనంతర జీవోలపై దాఖలైన వ్యాజ్యాలను ఉన్నత న్యాయస్థానం విచారించింది. ఆర్టికల్ 213 ప్రకారం ప్రస్తుత పరిస్థితుల్లో ఆర్డినెన్స్ ఇచ్చే అధికారం లేదని హైకోర్టు పేర్కొంది. రమేశ్ కుమార్ను తిరిగి కమిషనర్గా నియమించాలని ఆదేశాలు జారీ చేసింది.