తెలుగుదేశం పార్టీ నాయకుడు, సంగం డైరీ చైర్మన్ ధూళిపాళ్ల నరేంద్ర ను వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం వదిలేలా కనిపించడం లేదు.
తాజాగా మరో కేసు నమోదు అయింది. ధూళిపాళ్ల నరేంద్ర బెయిల్ పై విడుదల అయిన తరువాత, ఆయన పాలకవర్గ సమావేశం నిర్వహించాల్సి వచ్చింది.
దాంతో ఆయన గత నెల 24వ తేదీన విజయవాడలో ఒక హోటల్ లో సంగం డైరీ పాలక వర్గం సమావేశం ఏర్పాటు చేసారు.
ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు కూడా తీసుకున్నారు. ఎపిడమిక్ డిసీజ్ ఆక్ట్ నిబంధలకు విరుద్ధంగా, కర్ఫ్యూ నిబంధనలకు విరుద్దంగా ధూళిపాళ్ల నరేంద్ర ఈ సమావేశం ఏర్పాటు చేసారని పోలీసులు భావించారు.
విజయవాడ పటమట ఎస్ఐ కిషోర్ కుమార్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ధూళిపాళ్ల నరేంద్ర పై కేసు నమోదు చేసారు.
అలాగే పాలక వర్గం సమావేశం ఏర్పాటు చేసిన హోటల్ లో ఉన్న సిసిటీవీ ఫూటేజ్ ని కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
కంపెనీ సెక్రటరీకి నోటీసులు ఇవ్వటంతో, విజయవాడ పటమట ఎస్ఐ దగ్గరకు విచారణ నిమిత్తం హాజరు అయ్యారు.
సంగం డైరీ ప్రతినిధులు పోలీసులు తీరుని ప్రశ్నిస్తున్నారు. అయితే వీరి అభ్యంతరాలను ఎవరూ పట్టించుకోవడం లేదు.