తరతరాలుగా వస్తున్న సాంప్రదాయాన్ని తిరుమల తిరుపతి దేవస్థానాల ట్రస్టు బోర్డు పక్కన పెట్టేసింది. అదీ కూడా అత్యంత కీలకమైన సాంప్రదాయం.
అత్యంత నిష్టతో ఆచరించి తిరుమల పవిత్రతను కాపాడేందుకు నిర్దేశించిన సాంప్రదాయం. అలాంటి సాంప్రదాయాన్ని తిరుమల తిరుపతి దేవస్థానాల ట్రస్టు బోర్డు పక్కన పెట్టేయడం ఇప్పుడు అత్యంత తీవ్రమైన వివాద రూపం సంతరించుకుంటున్నది.
తిరుమల తిరుపతి దేవస్థానాల ట్రస్టు బోర్డును 1933లో ఏర్పాటు చేశారు. తొలి ముఖ్య కార్యనిర్వహణాధికారిగా చెలికాని అన్నారావును నియమించారు.
అన్ని విషయాలను పరిగణనలోకి తీసుకుని ముందుకు జాగ్రత్త చర్యగా తిరుమల పవిత్రతను కాపాడేందుకు ఆయన ఒక నిబంధన ఏర్పాటు చేశారు. అదేమంటే తిరుమల దేవదేవుడిని సందర్శించుకోవడానికి వచ్చే అన్య మతస్థులు ఒక డిక్ల రేషన్ ఇవ్వాలి.
తాము వేరే మతానికి చెందిన వారమైనా కూడా దేవదేవుడి లో పూర్తి నమ్మకంతో వస్తున్నామని, తిరుమల వేంకటేశ్వరుడిని కొలుచుకోవడానికి అవకాశం ఇవ్వాలని ఆ డిక్లరేషన్ లో ఉంటుంది.
ఆ డిక్లరేషన్ పై సంతకం చేస్తే ఏ మతానికి చెందిన వారైనా దేవాలయంలోకి అనుమతిస్తారు. ఎవరూ అభ్యంతరం చెప్పరు. అలాంటి డిక్లరేషన్ అంశాన్ని టిటిడి బోర్డు పక్కన పెట్టేసింది.
ఏ మతం వారైనా ఎలాంటి డిక్లరేషన్ అవసరం లేకుండానే వేంకటేశ్వరుడిని దర్శించుకోవచ్చునని నిర్ణయించారు. ఇది హిందూ మత విశ్వాసాలను దెబ్బతీయడమేనని హిందూ భావజాలం వున్న వారు భావిస్తున్నారు.
శ్రీ వారి సాలకట్ల బ్రహ్మోత్సవాల లో భాగంగా ఈ నెల 23న ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి శ్రీవారికి పట్టువస్త్రాలను బహూకరించనున్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి భార్య భారతి సమేతంగా వచ్చి శ్రీ వారి ఉత్సవాల్లో పాల్గొనాలని నర్సాపురం ఎంపీ రఘురామ కృష్ణ రాజు ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేసారు.
అప్పటినుంచి హిందూ వాదులు అన్యమత విశ్వాసం ఉన్న ముఖ్యమంత్రి శ్రీవారి ఉత్సవాలకు ఎలా వస్తారోనన్న ఉత్కంఠతో వున్నారు.
ఈ నేపథ్యంలో నిన్న తిరుమల లో మాట్లాడిన తిరుమల తిరుపతి దేవస్థానాల ట్రస్టుబోర్డు చైర్మన్ వై.వి. సుబ్బారెడ్డి అన్యమతస్తులకు ఆలయ ప్రవేశంలో ఇబ్బంది లేకుండా డిక్లరేషన్ తో సంబంధం లేకుండా శ్రీ వారి దర్శనం చేసుకోవచ్చునని ప్రటించారు.
ఏ మతస్థులైనా స్వామి సేవలో పాల్గొనవచ్చని వెంకటేశ్వర స్వామిపై నమ్మకంతో వస్తే చాలన్నారు. గతంలో కూడా టీటీడీకి ఎవరూ డిక్లరేషన్ ఇచ్చిన సందర్భాలు లేవంటున్నారు.
శ్రీవారిని దర్శించుకోవడానికి వేలాదిమంది వస్తున్నారని వారందర్ని డిక్లరేషన్ అడుగుతున్నామా అంటూ ప్రశ్నించారు. తిరుమలలో అన్యమత ప్రచారాలు జరగడం లేదని.. ఉద్దేశపూర్వకంగానే టీటీడీపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని అయన మండిపడ్డారు.