ఖమ్మం జిల్లాలో ఏం జరుగుతున్నదో ఏమో కానీ సూది మందుతో మర్డర్లు చేస్తున్నారు. అక్రమ సంబంధం కారణంగా ఖమ్మం జిల్లా చింతకాని మండలంలోని బొప్పారం గ్రామానికి చెందిన జమాల్ సాహెబ్ (48) అనే తాపీ మేస్త్రీ ని అతని భార్య మరో ముగ్గురు కలిసి ఇంజెక్షన్ తో మర్డర్ చేసిన విషయం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ సంఘటన మరువక ముందే మరో ఇంజెక్షన్ మర్డర్ వెలుగులోకి వచ్చింది.
అదీ కూడా ఖమ్మం జిల్లాలోనే కావడం గమనార్హం. ఖమ్మంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి బిక్షం అనే ఒక వ్యక్తి తన భార్యను డెలివరీ కోసం తీసుకెళ్లాడు. అక్కడ ఆమెకు సెలైన్ బాటిల్ ఎక్కించడంతో కొద్ది సేపటికే ఆమె మృతి చెందింది. వైద్యుల నిర్లక్ష్యంతోనే ఇలా జరిగిందని అతను ఆందోళనకు దిగాడు. ఏం జరిగిందో ఆసుపత్రి సిబ్బందికి అర్ధం కాలేదు. చివరకు ఆస్పత్రి యజమాన్యం సీసీ ఫుటేజీని పరిశీలించింది. భర్త భిక్షం ఆసుపత్రి సిబ్బంది పెట్టిన సెలైన్ బాటిల్ లో మరో సూదితో ఏదో మందు ఎక్కిస్తున్నట్లు అందులో స్పష్టంగా కనిపించింది. వెంటనే దీనిపై డాక్టర్లు ఖమ్మం టూటౌన్ పోలీసులకు సమాచారం ఇచ్చారు.
బిక్షం తన రెండో భార్య అయిన ఈ మహిళను హత్య చేయాలని ప్లాన్ చేసి పథకం ప్రకారం ఆమెను ఆసుపత్రిలో చేర్పించి ఆమెకు పెట్టిన సెలైన్ బాటిల్ లో పాయిజన్ ఎక్కించాడని పోలీసుల ప్రాధమిక దర్యాప్తులో తేలింది. ఈ హత్యపై పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది. కాగా,ఖమ్మం జిల్లాలో వారం రోజుల వ్యవధిలోనే రెండు సూది మందు హత్యలు జరగడంతో అసలు వీరికి ఆ డ్రగ్ ఎవరు,ఎక్కడ విక్రయిస్తున్నారని జిల్లా ప్రజలు ఆందోళన చెందుతున్నారు.