రాజస్థాన్ బాధ్యతల నుంచి తప్పుకుంటున్నట్లు కాంగ్రెస్ నేత అజయ్ మాకెన్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేకు లేఖ రాశారు. వారం రోజుల కిందట ఆయన ఈ లేఖ రాసినా అది ఇప్పుడు తెరపైకి వచ్చింది. ఆయన నవంబర్ 8న ఈ లేఖ రాశారు. సెప్టెంబర్ 25న రాజస్థాన్లో జరిగిన రాజకీయ ప్రకంపనలకు అజయ్ మాకెన్ కేంద్రంగా నిలిచారు. ముఖ్యమంతి అశోక్ గెహ్లాట్ కు సచిన్ పైలట్ కు మధ్య జరిగిన రాజకీయ గొడవల సందర్భంగా మాకెన్ నిర్వహించిన పాత్రపై కూడా తీవ్ర విమర్శలు వచ్చాయి. అశోక్ గెహ్లోట్ ను ఏఐసిసి అధ్యక్షుడుగా చేసేందుకు రాజస్థాన్ ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పుకోవాల్సిందిగా అధిష్టానం కోరింది. అయితే అందుకు అశోక్ గెహ్లోట్ కొన్ని షరతులు విధించారు. తన స్థానాన్ని తాను సూచించిన వారికే ఇవ్వాలని సచిన్ పైలెట్ ను సీఎం చేయరాదని కోరారు. దాంతో పరిస్థితిని మదింపు వేసి నివేదిక ఇచ్చేందుకు అజయ్ మాకెన్ ను పార్టీ అధిష్టానవర్గం రాజస్థాన్ కు పంపింది. సెప్టెంబరు 25న రాజస్థాన్లో జరిగిన సంఘటనలను ఆయన నివేదికలో పేర్కొన్నారు. లెజిస్లేచర్ పార్టీ సమావేశానికి దూరంగా ఉన్న ముగ్గురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు వేరే సమావేశం నిర్వహించి గెహ్లాట్పై విశ్వాసం వ్యక్తం చేశారు. సచిన్ పైలట్కు అనుకూలంగా అజయ్ మాకెన్ ప్రవర్తిస్తున్నారని కూడా వారి ఆరోపణ. సమావేశం అనంతరం ముగ్గురు నేతల క్రమశిక్షణా రాహిత్యాన్ని మాకెన్ హైకమాండ్కు నివేదించారు. ముగ్గురికి నోటీసులు పంపి సమాధానం చెప్పాలని అధిష్టానం సమన్లు జారీ చేసింది. ముగ్గురు నేతలు కూడా తమ సమాధానాలు చెప్పారు. ఆ తర్వాత కూడా వారిపై కాంగ్రెస్ హైకమాండ్ ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఆ ముగ్గురిపై ఎలాంటి చర్యలు తీసుకోకపోగా వారికి భారత్ జోడో యాత్ర బాధ్యతలు అప్పగించారు. దీన్ని జీర్ణించుకోలేని మాకెన్ రాజస్థాన్ బాధ్యతల నుంచి తప్పుకోవాలని భావిస్తున్నారు.
previous post