ఎంకి పెళ్లి సుబ్బి చావుకు వచ్చినట్లు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎన్నికల కమిషనర్ విషయంలో హైకోర్టులో ఎదురుదెబ్బ తినడం గవర్నర్ పదవికి ముప్పు తెచ్చేలా కనిపిస్తున్నది. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పదవి కాలాన్ని కుదిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రూపొందించిన ఆర్డినెన్సుపై గవర్నర్ ఆఘమేఘాలపై సంతకం చేశారు.
ప్రభుత్వం పంపిన ప్రతిపాదనను పరిశీలించాలని రాష్ట్ర బిజెపి లేఖ రాసినా దాన్ని పరిశీలించకుండా ఆర్డినెన్సుపై గవర్నర్ హడావుడిగా సంతకం చేశారని ఇప్పటికే రాష్ట్ర బిజెపి కేంద్ర పార్టీకి ఫిర్యాదు పంపింది. ఎంతో కీలకమైన ఆర్డినెన్సులపై సంతకం చేసే ముందు న్యాయ సలహాలు తీసుకోవాల్సిన అవసరం గవర్నర్ కు ఉంటుంది.
న్యాయ సలహా తీసుకోకుండా ఎవరినీ సంప్రదించకుండా సంతకం చేయడానికి కుదరదు. ఎందుకంటే గవర్నర్ వ్యవస్థకు అంతటి బాధ్యత ఉంటుంది. మంత్రి మండలి సిఫార్సులను ఆమోదించాల్సిన అవసరం ఉన్నా న్యాయ పరిశీలన జరుపుకోకుండా గవర్నర్లు నిర్ణయాలు తీసుకోరు. ఆర్డినెన్సు జారీ చేయడం తదితర అంశాలలో గవర్నర్ వ్యవస్థ మరింత జాగ్రత్తగా ఉంటుంది.
న్యాయ కోవిదుల సలహాలు సూచనల ప్రకారమే గవర్నర్లు నిర్ణయం తీసుకునే ఆనవాయితీ ఉంది. అయితే ఆంధ్రప్రదేశ్ గవర్నర్ మాత్రం ఇవేవీ ఆలోచించకుండా రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పదవి కాలాన్ని కుదిస్తూ జారీ చేసిన ఆర్డినెన్సుపై సంతకాలు చేసేశారు. ఆంధ్రప్రదేశ్ బిజెపి పంపిన ఫిర్యాదును కేంద్ర ప్రభుత్వం సీరియస్ గా తీసుకున్నది.
అయితే అంశం న్యాయ స్థానం పరిధిలో ఉన్నందున ఇప్పటి వరకూ ఈ అంశంపై కేంద్రం దృష్టి సారించలేదు. ఇప్పుడు రాష్ట్ర హైకోర్టు తీర్పు వెలువడినందున గవర్నర్ వ్యవహార శైలి చర్చనీయాంశమైంది. గవర్నర్ జారీ చేసిన ఆర్డినెన్సును హైకోర్టు కొట్టేసినందున గవర్నర్ ను నియమించిన కేంద్రంలోని బిజెపి ప్రభుత్వానికి కూడా మచ్చ తెచ్చే వ్యవహారం గా మారే అవకాశం ఉంది.
అందుకే ఈ అంశంపై కేంద్ర ప్రభుత్వం సీరియస్ గా ఆలోచిస్తున్నట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. గవర్నర్ ను రీకాల్ చేసేంతటి తీవ్ర నిర్ణయం తీసుకుంటారా లేక సాధారణ బదిలీలు చేసే సమయంలో సాగనంపుతారా అనే అంశంపై తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.