అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెంది మరో ఎమ్మెల్యేకి కరోనా సోకింది. గుంటూరు జిల్లా పొన్నూరు ఎమ్మెల్యే కిలారి రోశయ్యకు కరోనా పాజిటివ్ అని తేలింది. ఇదే విషయమై రోశయ్య స్పందించారు. గురువారం నాడు కరోనా టెస్టులు చేయించుకున్నాని, కలెక్టరేట్లో సీఎం వీడియో కాన్ఫరెన్స్కి వెళ్లినప్పుడు ఈ విషయంపై తనకు సమాచారం అందిందన్నారు.
అయితే తనకు ఎలాంటి కరోనా లక్షణాలు లేవని, ఆరోగ్యంగానే ఉన్నానని రోశయ్య తెలిపారు. ప్రజాక్షేమం కోసం హోం క్వారంటైన్లో ఉంటానని ఆయన తెలిపారు. ప్రజా సమస్యలపై ఫోన్, వాట్సప్లో తనను సంప్రదించవచ్చునని రోశయ్య పేర్కొన్నారు. ఎమ్మెల్యే రోశయ్యకు కరోనా పాజిటివ్ అనే సమాచారం తెలియడంతో కలెక్టరేట్లో మీటింగ్కు వచ్చిన ఆయనను కలెక్టర్ వెనక్కి పంపించారు.
ఎమ్మెల్యే కూర్చున్న చైర్ను బయట వేసి.. మీటింగ్ హాల్ను శానిటైజ్ చేయించారు. ఎమ్మెల్యేకు పాజిటివ్ అని తేలడంతో మీటింగ్కు వచ్చిన హోంమంత్రితో పాటు ప్రజాప్రతినిధుల్లో భయం పట్టుకుంది. హుటాహుటిన కరోనా టెస్టులు చేయించుకున్నారు.