ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి రెండో విడత అమ్మఒడి కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు సిద్దమైన నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ డాక్టర్ ఎన్.రమేష్ కుమార్ షాక్ ఇచ్చారు. పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిందని, సంక్షేమ పథకాలను ప్రభుత్వం ఆపేయాలని ఆయన ఆదేశించారు.
అమల్లో ఉన్న పథకాలను కూడా ఆపేయాలని ఆయన తన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. అసెంబ్లీ సమావేశాల సందర్భంగా గవర్నర్ ప్రసంగంలో పేర్కొన్న సంక్షేమ పథకాలకు బడ్జెట్ కేటాయించినా ఓటర్లను ప్రభావితం చేసినట్టే అవుతుందని స్పష్టం చేశారు.
దీనితో అమ్మఒడి పథకానికి ఎన్నికల కోడ్ అడ్డంగా మారనుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఇళ్ల పట్టాల పంపిణీపై కూడా ఆంక్షలు విధించారు. ఈ కార్యక్రమాలు ఓటర్లను ప్రభావితం చేస్తాయి కాబట్టి… తక్షణమే ఆపేయాలని ఆదేశించారు.
ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఏం చేయబోతోందా? అనే విషయం ఆసక్తికరంగా మారింది. మరోవైపు, ఈ ఎన్నికలను ఆపేయాలని కోరుతూ హైకోర్టులో ప్రభుత్వం హౌస్ మోషన్ పిటిషన్ వేసింది. సోమవారం ఈ పిటిషన్ ను హైకోర్టు విచారిస్తుంది.